• Telugu News
  • /Breaking

IRCTC Tour package | షిర్డీ సాయిబాబా దర్శకానికి వెళ్లాలనుకుంటున్నారా..? రూ.7వేలకు ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

Reported by: Vineela | Breaking | Mar 14, 2024, 10:03 am IST
Read Time: 4 mins
IRCTC Tour package | షిర్డీ సాయిబాబా దర్శకానికి వెళ్లాలనుకుంటున్నారా..? రూ.7వేలకు ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Tour package | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. బాబాను దర్శించుకునేందుకు షిర్డీ వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలోని విజయవాడ నుంచి షిర్డీ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాయి సన్నిధి ఎక్స్‌ విజయవాడ పేరిట ఈ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్‌ చేస్తున్నది. ఈ ప్యాకేజీలో మూడు రాత్రులు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ నెల 19న ప్యాకేజీ అందుబాటులో ఉన్నది.

పర్యటన కొనసాగుతున్నది ఇలా..

ఈ నెల 19న పర్యటన మొదలవుతుంది. ఉదయం 10.15 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి 17208 నంబరు గల రైలులో బయలుదేరుతారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం షిర్డీ సాయినగర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు చేరుతారు. హోటల్‌లో రెడీ అయ్యాక బాబా దర్శనానికి వెళ్తారు. ఆ రోజు షిర్డీలోనే బస ఉంటుంది. మూడో రోజు ఉదయం అల్పాహారం చేసుకొని హోటల్‌ను ఖాళీ చేస్తారు. ఆసక్తి ఉన్న వారు మరోసారి సాయిబాబా దర్శనానికి వీలుంటుంది. ఆ తర్వవాత షిర్డీ నుంచి శని శింగనాపూర్ వెళ్తారు. అక్కడ దర్శనాలు పూర్తి చేసుకొని తిరిగి నాగర్‌సోల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుతారు. సాయంత్రం 6.30 గంటలకు రైలు నంబర్‌ 17205 రైలులో తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. నాలుగో రోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు ఇవే..

రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్‌, స్టాండర్డ్‌ కేటగిరిలు ఉండగా.. కంఫర్ట్‌లో థర్డ్‌ ఏసీ, స్టాండర్డ్‌ కేటగిరి స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్‌ కేటగిరిలో సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.14,930.. డబుల్‌ ఆక్యుపెన్సీ రూ.9,430.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8,030 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల పిల్లలకు విత్‌ బెడ్‌తో రూ.7,320.. వితవుట్‌ బెడ్‌ అయితే రూ.6,330గా నిర్ణయించారు. స్లీపర్‌లో సింగిల్‌ షేరింగ్‌కు రూ.12,470.. డబుల్‌ ఆక్యూపెన్సీకి రూ.6,970.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,570 ఉంటుంది. పిల్లలకు విత్‌ బెడ్‌ అయితే రూ.4,860.. విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే.. రూ.3,870 ప్యాకేజీ నిర్ణయించారు. అలాగే నలుగురు నుంచి ఆరుగురు పర్యాటకులు కలిసి టికెట్లు బుక్‌ చేసుకుంటే మరింత ధర తగ్గనున్నది.