• Telugu News
  • /Breakingnews

Ponnam Prabhak: కేటీఆర్ సవాల్ కు మంత్రి పొన్నం కౌంటర్

Reported by: Y.V. Narsimha Reddy | breaking news | Jul 05, 2025, 1:40 pm IST
Read Time: 3 mins
Ponnam Prabhak: కేటీఆర్ సవాల్ కు మంత్రి పొన్నం కౌంటర్

ప్రెస్ క్లబ్ లో కాదు..అధికారికంగా సభలో చర్చిద్దాం రండి

విధాత, హైదరాబాద్ : గోదావరి, కృష్ణ జలాలు..బనకచర్ల..వ్యవసాయంపై చర్చకు ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు రావాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. కేటీఆర్ సవాల్ ను మేం స్వీకరిస్తున్నామని..అయితే శాసన సభ్యుడిగా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారని..అందుకు ప్రెస్ క్లబ్ లో కాకుండా శాసనసభలో అధికారికంగా భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆన్ రికార్డుగా చర్చిద్దామని..ప్రతిపక్ష నేత కేసీఆర్ ను తీసుకుని సభకు రావాలని పొన్నం ప్రతిసవాల్ విసిరారు. ప్రభుత్వ పథకాలు అన్ని అమలవుతున్నప్పటికి..బనకచర్లకు వ్యతిరేకంగా..తెలంగాణ నదిజలాల హక్కుల సంరక్షణకు కాంగ్రెస్ పోరాడుతున్నప్పటికి కేటీఆర్ మీడియా ముందు ఇష్టారాజ్యంగా విమర్శలు చేశారని పొన్నం మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియమకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ వాటన్నింటికి తూట్లు పొడిచిందన్నారు. చర్చలకు భయపడే వాళ్లం కాదని..మేం ఉద్యమాల నుంచే వచ్చామన్నారు. శాసన సభలో చర్చకు రమ్మంటే ప్రెస్ మీట్ లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు.

పదేళ్లలో గోదావరి, కృష్ణ జలాల్లో ఎలా అన్యాయం చేశారు..మన నది జలాల హక్కులను ఏ విధంగా మీ ఇష్టారాజ్యంగా ఏపీకి ధారదత్తం చేశారో అన్నింటికి సాక్ష్యాలు ఉన్నాయన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని..బేసీన్లు లేవు..భేషజాలు లేవని..మిగులు జలాలను అందరం వాడుకుందామని పదేళ్లలో కేసీఆర్ మాట్లాడిన మాటలు బహిరంగ రహస్యమేనన్నారు. వరద జలాలు..మిగులు జలాలు..ఎవరి కారణంగా తెలంగాణ నది జలాలు ఏపీ కొల్లగొడుతుందన్న అన్ని అంశాలపై చర్చిద్దామని..మీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కూడా తీసుకుని సభకు రావాలని పొన్నం సూచించారు.