Economic Survey | ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలకు ముప్పేనా.. ఆర్థిక సర్వేలో ఆసక్తికర విషయాలు..!
Economic Survey | ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ (AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది. సెర్చ్ ఇంజన్స్ మొదలు సోషల్ మీడియా సైట్స్ వరకు అన్నీ ఏఐని వినియోగిస్తున్నాయి. దాంతో ఏఐ టెక్నాలజీ ఉద్యోగాలను కబలిస్తుందనే వాదన జోరందుకుంది.

Economic Survey : ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ (AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది. సెర్చ్ ఇంజన్స్ మొదలు సోషల్ మీడియా సైట్స్ వరకు అన్నీ ఏఐని వినియోగిస్తున్నాయి. దాంతో ఏఐ టెక్నాలజీ ఉద్యోగాలను కబలిస్తుందనే వాదన జోరందుకుంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో నుంచి ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే వాదన వినిపిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతోన్న ఉద్యోగాల కోతలు, కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.
తాజాగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులపై కచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఉద్యోగాల కల్పనపై ఏఐ ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కృత్రిమ మేధ ఉత్పాదకతను పెంచుతుందననడంలో ఎంత వరకు నిజం ఉందో.. ఈ ప్రభావం అనేక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుందనడంలో కూడా అంతే నిజం ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో దాదాపు ప్రతీ రంగంలో ఏఐ మార్పులను తీసుకొస్తుందని, దాంతో ఆయా రంగాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం ఖాయమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ ఏఐ ప్రభావం భారత్తో పాటు ప్రపంచంలోని చాలా దేశాలపై కచ్చితంగా ప్రభావం చూపనుందని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ఊహకందని మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే సర్వేలో పేర్కొన్న విషయాల ప్రకారం ఇప్పటికే చాలా రంగాల్లో ఏఐ వాడకం బాగా పెరిగింది.
సంప్రదాయ ఐటీ కంపెనీలతోపాటు ఇతర కంపెనీల్లో కూడా ఏఐ వినియోగాన్ని పెంచేశారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంతోపాటు, ఉద్యోగులను తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి రంగాలపై కూడా ప్రభావం పడనుందని నిపుణులు అంచణాలు వేస్తున్నారు. ఏఐకి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుంటేనే ఉద్యోగులు రాణించగలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.