విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆగస్టు నెలలో పుంజుకున్న బంగారం ధరలు గత వారం రోజులుగా పతనమవతూ వస్తున్నాయి.
సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,470 వద్ద తగ్గి రూ. 1,56,770 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,350 తగ్గి రూ.1,43,700 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.2,60,000వద్ద నిలిచింది.
కొనసాగనున్న ధరల హెచ్చు తగ్గులు..
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న ఆందోళనల నడుమ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆగస్టు మాసంలో అనూహ్యంగా పుంజుకున్నాయి. అయితే వారం రోజులుగా పడిపోయిన పసిడి ధరలు సెప్టెంబర్ మాసంలోనూ హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులకు కారణం అవుతాయని పేర్కొంటున్నారు.
అయితే ఇటీవల అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,600 డాలర్ల చారిత్రాత్మక మార్కును విజయవంతంగా దాటగా.. 2026 సంవత్సరం ముగిసే నాటికి ఇది 4,900 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ అంచనా వేయడం గమనార్హం.
