ఆనవాళ్లు లేకుండా..చైనా–నేపాల్‌ సరిహద్దు ధ్వంసం!

నేపాల్ హిమనది వరదల జలప్రళయం ఆ దేశాన్ని తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలను మిగల్చడమే కాకుండా సరిహద్దులను కూడా కనిపించకుండా మార్చేసింది. చైనా–నేపాల్‌ సరిహద్దు రసువాగఢి సరిహద్దు క్రాసింగ్‌ వరదల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. సరిహద్దులు చెదిరిపోయిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Aug 29, 2026, 12:13 pm IST
Read Time: 4 mins
ఆనవాళ్లు లేకుండా..చైనా–నేపాల్‌ సరిహద్దు ధ్వంసం!

విధాత : నేపాల్ హిమనది వరదల జలప్రళయం ఆ దేశాన్ని తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలను మిగల్చడమే కాకుండా సరిహద్దులను కూడా కనిపించకుండా మార్చేసింది. చైనా–నేపాల్‌ సరిహద్దు రసువాగఢి సరిహద్దు క్రాసింగ్‌ వరదల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. లోయ ప్రాంతం వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. సరిహద్దుల చెదిరిపోయిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.

నేపాల్ వరదలలో ఇప్పటిదాకా 579 మందికిపైగా మృతి చెందారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానిక అధికార వర్గాలు తెలిపాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1473 మంది గాయాలపాలైనట్లు పేర్కొన్నారు. ఇంకా 1,924 మంది ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నాయి. వీరిలో 517 మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపాయి. నేపాల్‌లో 320 మంది భారతీయుల జాడ తెలియరావడం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.టిబెట్‌లో 260 మంది విదేశీయులు సహా మొత్తం 558 మంది గల్లంతయ్యారని పేర్కొన్నాయి.

పొంచి ఉన్న మరో ముప్పు

మరోవైపు- భోటే కోశీ నదిలో బురదతో కూడిన వదర నీటి ఉదృతి భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో నది పరివాహక ప్రాంతంలో ప్రజలను నేపాల్‌ జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) హెచ్చరించింది. భోటే కోశీ, త్రిశూలి ప్రాంతాల్లో ఉంటున్నవారు, ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితులు ఏమాత్రం ప్రమాదకరంగా అనిపించినా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.