Site icon vidhaatha

నిజాంపేటలో అత్యాధునిక 800 పడకల ఆసుపత్రి

ఎస్ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ కీలక ఒప్పందం

విధాత, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిజాంపేటలో 800 పడకల అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్, అజెంక్య డీవై పాటిల్ హెల్త్‌కేర్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించడమే ఈ రెండు సంస్థల లక్ష్యమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొత్త ఆసుపత్రిలో అత్యవసర చికిత్స, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి మంచి వైద్యం అందుబాటులో ఉంటుందని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు వైద్యం కోసం వేరే చోటుకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. ఆసుపత్రి నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్ చైర్మన్ దండు శివ రామ రాజు మాట్లాడుతూ.. అందరికీ మంచి వైద్యం అందించాలనే తన కల ఈ ఆసుపత్రితో నెరవేరుతుందని అన్నారు. అజెంక్య డీవై పాటిల్ హెల్త్‌కేర్ చైర్మన్ డాక్టర్ అజెంక్య పాటిల్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల సేవలు విస్తరించి, హైదరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. ఈ ఒప్పందానికి యూకేలోని ఆప్టిమస్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే సంస్థ సలహాలు ఇచ్చింది. ఈ సంస్థకు చెందిన అభయ్ అహుజా ఈ భాగస్వామ్యం దేశంలోనే ఇతర ఆరోగ్య సంస్థలకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ఆసుపత్రి వల్ల హైదరాబాద్ వైద్య కేంద్రంగా మరింత బలోపేతం అవుతుంది. అలాగే, ప్రజలకు సరసమైన ధరల్లో, నమ్మకమైన వైద్య సేవలు అందుతాయన్నారు.

Exit mobile version