ముంబయి: టాటా కెమికల్స్ లిమిటెడ్ 2025 మార్చి 31తో ముగిసిన త్రైమాసికం, సంవత్సర ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.3,509 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1% పెరిగింది. అయితే, అన్ని ప్రాంతాల్లో ధరల ఒడిదుడుకులతో లాభాలు తగ్గాయి.
EBITDA రూ.327 కోట్లుగా ఉండగా, గత సంవత్సరం ఇదే సమయంలో రూ.443 కోట్లుగా ఉంది. నికర లాభం రూ.12 కోట్ల నష్టంగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.145 కోట్ల లాభం వచ్చింది. సంవత్సరం మొత్తంలో ఆదాయం రూ.14,887 కోట్లుగా ఉండగా, గత సంవత్సరం రూ.15,421 కోట్లుగా ఉంది. సోడా యాష్, బైకార్బ్ విక్రయాలు 6% పెరిగాయి. కంపెనీ బోర్డు షేరుకు రూ.11 డివిడెండ్ను సిఫారసు చేసింది.
సవాళ్లు…
టాటా కెమికల్స్ మిథాపూర్లో 230 వేల టన్నుల సోడా యాష్, 140 వేల టన్నుల బైకార్బ్ సామర్థ్యంతో ప్లాంట్ని ప్రారంభించింది. యూకేలోని మిడిల్విచ్లో 70 వేల టన్నుల ఫార్మా గ్రేడ్ సాల్ట్ని కూడా షురూ చేసింది. యూకేలోని లాస్టాక్లో సోడా యాష్ ఉత్పత్తి ఫిబ్రవరి 2025 నుంచి నిలిచిపోయింది. దీనివల్లరూ.55 కోట్ల అదనపు భారం పడింది. ప్రపంచ మార్కెట్లో డిమాండ్లో తేడాలున్నాయి. భారతదేశంలో వృద్ధి కొనసాగుతుండగా, చైనా, అమెరికా, పశ్చిమ ఐరోపాలో గాజు డిమాండ్ తగ్గింది.
ఆసియా (చైనా, భారత్ మినహా), అమెరికా (అమెరికా మినహా)లో డిమాండ్ బలంగా ఉంది. ఆఫ్రికాలో స్వల్ప తగ్గుదల కనిపించింది. టాటా కెమికల్స్ సీఈఓ ఆర్.ముఖుందన్ మాట్లాడుతూ, “మార్కెట్ సవాళ్లు కొనసాగుతున్నాయి. అయినా, ఆవిష్కరణలు, డిజిటలైజేషన్, సస్టైనబిలిటీతో ముందుకు సాగుతున్నాం. స్థిరత్వాన్ని పెంపొందిస్తున్నాం. మా పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ, ప్రధాన వ్యాపారంపై దృష్టి సారిస్తాం” అన్నారు.