Ramoji Rao| ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసారు. ఆయన మృతికి రాజకీయ, సినీ వ్యాపార ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. బీజేపీ అగ్రనేత నరేంద్రమోదీ తన ట్విట్టర్ వేదికగా రామోజీరావు మృతిపట్ల సంతాపం తెలిపారు. రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి
Ramoji Rao| ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసారు. ఆయన మృతికి రాజకీయ, సినీ వ్యాపార ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. బీజేపీ అగ్రనేత నరేంద్రమోదీ తన ట్విట్టర్ వేదికగా రామోజీరావు మృతిపట్ల సంతాపం తెలిపారు. రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మోదీ తెలిపారు. పత్రికారంగంలో ఆయన సరికొత్త ప్రమాణాలు సెట్ చేశారని, ఆయన రచనలు, జర్నలిజం, సినిమాలు, ప్రపంచంపై చెరగని ముద్ర వేసాయని కొనియాడారు. దేశ అభివృద్ధి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. అలాంటి వ్యక్తిని కలిసి మాట్లాడినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. ఆయన మరణంతో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
రామోజీరావు మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన లోని లోటు జర్నలిజానికి ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని రేవంత్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.
రామోజీరావు మృతిపై చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని ఆయన అన్నారు. అక్షర యోధుడుగా, తెలుగు వెలుగుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని ఆయన చెప్పారు. తెలిపారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. సమస్యలపై పోరాటంలో రామోజీరావు అందరికీ స్ఫూర్తి అని చంద్రబాబు తెలియజేశారు.. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి రామోజీరావు మృతి పత్రికాలోకానికి తీరని లోటని పేర్కొన్నారామె. తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లు రామోజీరావు మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
రామోజీరావు మృతిపై సినీనటులు చిరంజీవి కూడా సంతాపం తెలిపారు.‘‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికెగిసింది’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా ఈనాడు పత్రిక మరియు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటిన వారి క్రాంతదర్శనం స్ఫూర్తిదాయకమైనది. రామోజీ రావు గారు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ గర్వకారణమైన శ్రీరామోజీరావు గారు లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రామోజీరావు అస్తమయంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సంతాపం తెలియజేశారు. మీడియా రంగానికి రామోజీరావు చేసిన సేవలు అమూల్యమైనవి. రామోజీరావు మరణం తీవ్ర విషాదానికి గురి చేసింది, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి అన్నారు.