విధాత, హైదరాబాద్ : ఫిల్మీ ఇండస్ట్రీ మాఫియా వంటిదని..సక్సెస్ వెంట బడుతూ పొగడుతుంటారని…ఆ వెనుకే పడదోస్తారని..జాగ్రత్తగా ఉండాలని..లేదంటే ఈ మాఫియా నిన్ను ఇండస్ట్రీలో బతుకనివ్వదని ‘లిటిల్హార్ట్స్’ హీరో మౌళి తనూజ్ ను నిర్మాత బండ్ల గణేష్ హెచ్చరించారు. గురువారం రాత్రి హైదరాబాద్లో ‘లిటిల్హార్ట్స్’ విజయోత్సవం జరిగింది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై సాయిమార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించారు. నిర్మాతగా ఆదిత్యహాసన్ వ్యవహరించగా.. బన్నీ వాస్, వంశీ నందిపాటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం విజయోత్సవ వేడుకలో హీరో విజయ్ దేవరకొండతో పాటు, నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేశ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ చిన్నసినిమాల విజయానికి ‘లిటిల్హార్ట్స్’ స్పూర్తిదాయకంగా నిలిచిందన్నారు. కథతో సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించిందని..ఇలాగే మరిన్ని చిన్న సినిమాలు విజయవంతం కావాలన్నారు. అప్పుడే పదికాలాల పాటు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుందన్నారు.
అలాగే సినిమా సక్సెస్ తో హీరో మౌళి తనూజ్ తన మూలాలు.. పరిమితులు మరిచిపోవద్దన్నారు. సక్సెస్ వచ్చిన సందర్భంలో అందరూ నిన్ను పొగుడుతుంటారని..ఆరుడుగులు ఉన్నావని..స్టార్ హీరో అవుతావని చెబుతారని…కాని నీవు మాత్రం నిన్నటి తరం నటుడు చంద్రమోహన్ తరహాలో సినిమాలు చేస్తూ పోవాలని..అలా అయితేనే ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కొనసాగుతావన్నారు. విజయోత్సవ వేడుకలకు వచ్చిన వారంతా పొగిడే మాటలకు ప్రభావితం కావద్దంటూ హితవు పలికారు.
అంతకుముందు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘లిటిల్హార్ట్స్’ విజయం పరిశ్రమకు ఎంతో కీలకమైందన్నారు. ఈ విజయంతో ఇందులోని ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోతాయన్నారు. వాళ్లతోపాటు పక్కనున్న ఇంకో పది ఇరవై మంది జీవితాలు కూడా మారిపోతాయని..నటుడు మౌళి తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తుంటనని. ఈ బృందం మరిన్ని విజయవంతమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘లిటిల్హార్ట్స్’ విజయోత్సవం సందడి చూస్తుంటే టీనేజర్ల కోసం మళ్లీ ఓ కథ రాయించి సినిమాని నిర్మించాలనిపిస్తుంది’’ అన్నారు. ఈ తరహా సినిమాలు మరిన్ని రావాలని..విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ హీరో అల్లు అర్జున్ చాలా ఏళ్ల తర్వాత ఒక థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూశారని..ఈ సినిమాను ఎంతో మెచ్చుకుని అందరూ చూడాలని ట్వీట్ చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. విజయ్ దేవరకొండతో గీతగోవిందం సినిమాకు మించిన సినిమా చేస్తాననన్నారు.
‘లిటిల్హార్ట్స్’ మౌళి తనూజ్ మాట్లాడుతూ దర్శకుడు సాయి మార్తాండ్ నాకు ఎంత బాగా కథ చెప్పాడో, సినిమాని అంతే బాగా తీశాడన్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో నాలాంటి నటులకు, ఇలాంటి సినిమాలకు ప్రోత్సాహం దక్కినట్లయ్యిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో అందరూ నువ్వు గెలిస్తే, మేం గెలిచినట్టుందని అంటుండటం ఆనందంగా ఉందన్నారు. సినిమా విజయవంతమైతే మా అమ్మానాన్నల్ని అమెరికాకి తీసుకెళదామనుకున్నానని..ఇప్పుడు వారి అమెరికా ప్రయాణం ఖరారైపోయిందన్నారు. సినిమా నిర్మాణ సమయంలో విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ ల ప్రోత్సాహం మరువలేనిదన్నారు.