మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు చెర్రీ. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీలో శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్కి తాత్కాలిక బ్రేక్ పడగా, ఏప్రిల్ 20న రాజమండ్రిలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. అనంతరం విశాఖపట్నంలో కూడా పలు సీన్స్ చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.. మొత్తంగా ఈ షెడ్యూల్ 9 నుండి10 రోజులు ఉంటుందని ఆ తర్వాత మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇక గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే రానున్న రోజులలో రామ్ చరణ్ చాలా బిజీ అవుతాడు కాబట్టి ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్లాడు. భార్య ఉపాసన కొణిదెల, కూతురు క్లింకారతో కలిసి థాయ్ లాండ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ వీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. ఉపాసన తమ టూర్కి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఉపాసన అభిమానుల కోసం షేర్ చేసిన పిక్స్లో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న కుక్కపిల్లను, మరో ఫోటోలో రామ్, ఉపాసన, ఏనుగు పిల్లకు బాతింగ్ చేస్తున్నట్టు ఫొటోలను మనం చూడవచ్చు. సముద్రంలో ఈత కొట్టడం, రెస్క్యూ క్యాంపులో ఏనుగుల రక్షణ గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం అని చెప్పిన ఉపాసన … అద్భుతమైన మెమోరీస్ ను థాయ్ లాడ్ ట్రిప్ ద్వారా పొందినట్టు అర్ధమవుతుంది. టూర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ దంపతులు మరి కొద్ది రోజులలోనే తిరిగి హైదరాబాద్కి రానున్నారు.