ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. ఎందుకంటే భవిష్యత్లో ఆ ఇంట్లోని వారంతా సుఖసంతోషాలతో, సిరిసంపదలు కలిగి ఉండాలని. ఇంటి మెట్ల నుంచి మొదలుకుంటే వాష్రూమ్ వరకు అన్ని విషయాల్లో వాస్తు నిపుణులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక ఇల్లంతా వాస్తు ప్రకారమే నిర్మించినప్పటికీ.. మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇల్లు వాస్తు ప్రకారమే నిర్మించాం కదా.. మనం వాస్తు నియమాలు పాటిస్తే ఎంత..? పాటించకపోతే ఎంత..? అని తేలికగా తీసుకుంటాం. అలా వాస్తు నియమాలు పాటించకపోతే ఆ ఇంటి యజమాని అప్పుల్లో మునిగిపోవడం ఖాయమని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం..
చెత్త డబ్బా అక్కడ ఉంచకూడదు..
చాలా మంది ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా దాని పక్కన చెత్త డబ్బా ఉంచుతుంటారు. కానీ ఇది వాస్తు శాస్త్ర ప్రకారం సరైంది కాదు. చెత్త డబ్బాను ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోకి వచ్చే సిరిసంపదలన్నీ.. అటు నుంచే అటే పోతాయట. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుందట. కాబట్టి డస్ట్ బిన్ను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా, ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టకూడదట. అలా నియమాలు పాటించిన వారి ఇంట్లో ధనం ఉంటుందట.
బెడ్పై భోజనం చేయకూడదు..
ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నప్పటికీ.. భార్యాభర్తలు ముచ్చట్లో మునిగి తేలుతూ.. బెడ్రూంను కాసేపు డైనింగ్ రూమ్గా మారుస్తారు. బెడ్రూంలోనే బెడ్పై కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆరగిస్తుంటారు. ఇలా మంచంపై కూర్చొని భోజనం చేయడం వల్ల ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుందట. మిగతా పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడుతాయట. కాబట్టి బెడ్ పై కూర్చొని భోజనం చేయొద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి పూటనే గిన్నెలు కడిగేయాలి..
కొంత మంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఎంగిలి గిన్నెలను అలానే సింక్లో ఉంచేస్తారు. పొద్దున్నే కడిగేద్దాంలే అనుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ ఇది మంచిది కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. వంట గదిలో ఎంగిలి గిన్నెలను అలానే ఉంచితే లక్ష్మీదేవి చల్లని చూపు ఇంటికి దూరమవుతుందట. అందుకే ఎంత కష్టమైనా రాత్రి సమయాల్లోనే గిన్నెలను కడగడం మంచిదని సూచిస్తున్నారు.