Rohini Karte | ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భానుడి( Sun ) భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. 46 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదవుతూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఎండలు మరింత ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే నేటి(సోమవారం) నుంచి రోహిణి కార్తె( Rohini Karte ) ప్రారంభం కానుంది. అయితే ఈ కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు అంటుంటారు.
మే 25న ప్రారంభమైన రోహిణి కార్తె.. జూన్ 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఏడాది కృత్తిక కార్తె నుంచే ఎండలు ముదిరిపోయాయి. కృత్తిక కార్తె 11న ప్రారంభమై 24న ముగిసింది. ఈ ఏడాది మాత్రం భరణి కార్తె చివరి నుంచే ఎండల ఉధృతి పెరిగి కృత్తిక కార్తెలోనే రోహిణి నాటి ఎండల తీవ్రత చూపించింది. నేటి నుంచి ప్రారంభమవుతున్న రోహిణి కార్తెలో ఎండలు ఏ స్థాయిలో దంచికొడుతాయో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
రోహిణి కార్తెలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. ప్రస్తుతం 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. వడగాలుల తీవ్రత కూడా కొనసాగే అవకాశం ఉంది. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై తీవ్ర ప్రభావం చూపనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ లక్షణాలు కన్పిస్తే డాక్టర్ను సంప్రదించండి..
మండుటెండలకు ప్రజలు వడదెబ్బతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. జ్వరం, వాంతులు, కళ్లు తిరగడం, చెమటలు పట్టడం, సొమ్మసిల్లి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు నీడపట్టున ఉండాలని, ప్రతీ రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు నీటిని సేవించాలని సూచిస్తున్నారు. పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి బొండాలు, ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
