Ujjaini Mahankali | భాగ్యనగరం గతవారం గోల్కొండ కోటలో తొలి బోనమెత్తింది. జులై 21న లష్కర్ బోనాల సందడి కొనసాగనుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరిగే బోనాల పండుగనే లష్కర్ బోనాలు అని పిలుస్తారు. ఈ లష్కర్ బోనాల పండుగకు హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తే ఆ ఇంట ఎలాంటి బాధలు ఉండవని, సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉంటారనేది భక్తుల విశ్వాసం. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న మహంకాళి అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అనే పేరు ఎలా వచ్చింది..? అసలు 1813లో ఏం జరిగింది..? అనే విషయాలను తెలుసుకుందాం..
అసలు 1813లో ఏం జరిగింది..?
సికింద్రాబాద్ సమీపంలోని పాత బోయిగూడకు చెందిన సురటి అప్పయ్య ఆనాడు బ్రిటీష్ ఆర్మీలో పని చేసేవారు. మొదట్లో సికింద్రాబాద్లోనే విధులు నిర్వర్తించారు. అయితే బదిలీల్లో భాగంగా 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది. ఇక అక్కడ విధుల్లో చేరిన కొద్ది రోజులకే ఉజ్జయినిలో కలరా వ్యాధి విజృంభించింది. వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని తన సహోద్యోగులతో కలిసి అప్పయ్య దర్శించుకున్నారు. కలరా వ్యాధి తగ్గి, ప్రజలు సంతోషంగా ఉంటే, తన సొంతూరులో ఉజ్జయిని అమ్మవారి గుడి కటిస్తానని అప్పయ్య మొక్కుకున్నారు. ఆయన కోరుకున్నట్లుగానే కొద్ది రోజుల్లోనే కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. చాలా మంది ప్రజలు కలరా నుంచి కోలుకున్నారు.
1815లో సికింద్రాబాద్లో ఆలయ నిర్మాణం..
ఉజ్జయిని అమ్మవారి కటాక్షం కారణంగానే కలరా వ్యాధి తగ్గిందని అప్పయ్యతో పాటు మిత్రులు భావించారు. దీంతో 1815లో అప్పయ్య సికింద్రాబాద్కు వచ్చారు. ఇక తన మొక్కు గురించి కుటుంబ సభ్యులతో ప్రస్తావించారు. బంధుమిత్రుల సాయంతో పాతబోయిగూడ బస్తీకి సమీపంలోని ఖాళీ స్థలంలో కట్టెతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక ఉజ్జయిని మహంకాళి అమ్మవారిగా నామకరణం చేశారు. ఉజ్జయినిలో ఆషాఢ మాసంలోనే అప్పయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలోనూ ఆషాఢంలో జాతర నిర్వహించాలని అప్పయ్య నిర్ణయించారు. అప్పట్నుంచి ఆషాఢ మాసంలోనే మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఆషాఢమాసంలో బోనాల జాతర
అప్పయ్య గుడి నిర్మించిన నాటి నుంచి అంటే, 1815 నుంచి ఆషాఢమాసంలో ప్రతి ఏటా బోనాల జాతర నిర్వహిస్తున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటే, అంటు వ్యాధులు సోకకుండా కాపాడటంతో పాటు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండేలా చూస్తుందని భక్తుల నమ్మకం. అందుకే, లష్కర్ బోనాల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.