• Telugu News
  • /Devotional

Padmanabhaswamy Temple | పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరుస్తారా!

ఆరవ నేలమాళిగ బీ గదిని మాత్రం నేటికి తెరవలేదు. దానికి నాగబంధం ఉందని..దానిని తెరిస్తే విపత్తులు సంభవిస్తాయన్న నమ్మకాల నేపథ్యంలో బీ గది తెరిచే సాహసం చేయలేదు. ఆరవ గది తలుపులపై నాగబంధం చెక్కి ఉండటం ఆ కథనాలను నమ్మేలా చేసింది. ఆరో నేలమాళిగను తెరుస్తారా లేదా అనే దానిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు.. ఆలయ పరిపాలన, నిర్వహణ అడ్వజరీ కమిటీలకు వదిలిపెట్టింది.

Reported by: Jagan Mohan Talluri | ఆధ్యాత్మికం | Aug 08, 2025, 8:03 pm IST
Read Time: 6 mins
Padmanabhaswamy Temple | పద్మనాభ స్వామి ఆరో నేలమాళిగను తెరుస్తారా!

Padmanabhaswamy Temple | కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఉన్న శ్రీ ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌యంలోని నేల‌మాళిగల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆలయం దిగువ భాగంలోని ఆరు రహస్య నేల మాళిగలను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ గా గుర్తించి..వాటిలో గతంలో ఐదింటిని తెరిచారు. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఆరు నేలమాళిగలను ఒకదాని తర్వాత ఒకటిగా తెరిచి చూడగా..రూ.లక్ష కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు, బంగారు విగ్రహాలను గుర్తించారు. వీటిలో ఈ, ఎఫ్‌ గదులలో ఆలయంలో నిత్య క్రతువులకు, సేవలకు ఉపయోగించే పాత్రలను నిల్వ చేశారు. సీ, డీ గదుల్లో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక దినాలలో పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తారు. ఏ గదిలో సుమారు లక్ష కోట్ల నిధి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖజానాలో మూడున్నర కేజీలుండే వజ్రం, రూబీతో నిండిన మహావిష్ణువు బంగారు విగ్రహం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, వజ్రాల కెంపులు, విలువైన రత్నాలు బయటకు వచ్చాయి. ఆ సంపదను నిపుణుల సమక్షంలో లెక్కగట్టారు. అయితే ఆరవ నేలమాళిగ బీ గదిని మాత్రం నేటికి తెరవలేదు. దానికి నాగబంధం ఉందని..దానిని తెరిస్తే విపత్తులు సంభవిస్తాయన్న నమ్మకాల నేపథ్యంలో బీ గది తెరిచే సాహసం చేయలేదు. ఆరవ గది తలుపులపై నాగబంధం చెక్కి ఉండటం ఆ కథనాలను నమ్మేలా చేసింది. ఆరో నేలమాళిగను తెరుస్తారా లేదా అనే దానిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు.. ఆలయ పరిపాలన, నిర్వహణ అడ్వజరీ కమిటీలకు వదిలిపెట్టింది.

‘బీ’ గ‌దిని తెర‌వాలి

టెంపుల్ అడ్వైజ‌రీ క‌మిటీ, టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ క‌మిటీ తాజా మీటింగ్‌లో బీ గదిని తెరిచే అంశంపై ఆసక్తికర చ‌ర్చ జ‌రిగింది. అడ్మినిస్ట్రేటివ్ క‌మిటీ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఎం. వేల‌ప్ప‌న్ నాయ‌ర్ మాట్లాడుతూ నేల‌మాళిగ‌లోని బీ గ‌దిని తెరువాల‌ని డిమాండ్ చేశారు. అయితే మిగతా స‌భ్యులు ఎవ‌రూ ఆ ప్ర‌తిపాద‌న‌కు స్పందించ‌లేదు. నేల‌మాళిగ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకునే ఆల‌య ప్ర‌ధాన అర్చకుడు ఈ స‌మావేశానికి హాజ‌రుకాకపోవడంతో దీనిపై జరిగిన చర్చ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఆల‌యం నైరుతీ దిశలో ఏ, బీ గ‌దులు ఉండగా..ఓ గ‌ది ఉత్త‌రం దిక్కుకు, ఓ గ‌ది ద‌క్షిణ దిక్కుకు ఉన్నాయి. ఆల‌యంలోని శ్రీ ప‌ద్మ‌నాభ‌స్వామి వారి శిర‌స్సు ప్రాంతంలో ఆ గ‌దులు ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం.. జూన్ 2011లో నేల‌మాళిగ‌లోని ఏ గ‌దిని తెరిచారు. ఆ గ‌దిలో ఉన్న సంప‌ద‌ను ఇన్వెంట‌రీలో ఎక్కించారు. అయితే బీ గ‌ది తెరిచే అంశంలో నాగ బంధం నేపథ్యంతో పాటు ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబం అభ్యంత‌రాలతో నిర్ణ‌యాన్ని టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్‌, అడ్వైజ‌రీ క‌మిటీల‌కు వ‌దిలేశారు. అప్పటి నుంచి బీ గది వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతునే ఉంది.

ఇవి కూడా చదవండి..

రిజర్వేషన్ల పరిమితిపై రాజ్యాంగం ఏం చెబుతున్నది?
GPT-5 | చాట్ జీపీటీ కొత్త అవతారం.. ‘ప్రొఫెసర్’ జీపీటీ–5 ఆవిష్కరణ