Shukra Moudyami | పెళ్లి( Marriage ) అంటేనే నూరేళ్ల పంట. అలాంటి వివాహాది శుభకార్యాల చేసేందుకు శుభ ముహుర్తం( Shubha Muhurtham ) చాలా అవసరం. శుభ ముహుర్తంలోనే చాలా మంది పెళ్లిళ్లు చేస్తారు. ఇక తెలుగు పంచాంగం( telugu Panchangam ) ప్రకారం మాఘ మాసం( Magha Masam ), శ్రావణ మాసం, వైశాఖ మాసంలో అధికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే రాబోయే కొత్త ఏడాది 2026లో వచ్చే మాఘ మాసంలో పెళ్లిళ్లకు అనువైన శుభ ముహుర్తాలు లేవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శుక్ర మౌఢ్యమి(Shukra Moudyami ) కారణంగానే ఈ సారి మాఘ మాసంలో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు లేవని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో శుక్ర మౌఢ్యమి అంటే ఏంటి..? మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మౌఢ్యమి అంటే ఏంటి..? ఇది ఏలా ఏర్పడుతుంది..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢాలు రెండు రకాలుగా ఉంటాయి. ఇందులో ఒకటి గురు మౌఢ్యమి కాగా, రెండోది శుక్ర మౌఢ్యమి. గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురు మౌఢ్యమి అని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్ర మౌఢ్యమి అని అంటారు. దీనినే వాడుక భాషలో మౌఢ్యమి అని వ్యవహరిస్తారు. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో భాగంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి సంభవిస్తుంది. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యుడు అతి పెద్ద గ్రహం. ఆయన తేజస్సు, శక్తి అనంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు శుక్ర గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే సూర్యునికి దగ్గరగా ఈ గ్రహాలు వచ్చినప్పుడు వాటి తేజస్సు కోల్పోవడం వలన మౌఢ్యమి ఏర్పడి శుభకార్యాలు నిషేధిస్తారు.
నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి..!
శుక్ర మౌఢ్యమి నవంబర్ 26 నుంచి ప్రారంభమై, 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగనుంది. అంటే తెలుగు పంచాంగం ప్రకారం.. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్టి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు శుక్ర మౌఢ్యమి కొనసాగనుంది. అంటే దాదాపు 83 రోజుల పాటు పెళ్లిళ్లకు శుభ ముహుర్తాలు లేనట్లే. ఈ కాలంలో పెళ్లిళ్లు జరగవు. ఎందుకంటే శుక్ర మౌఢ్యమినే కారణం.
మూఢంలో ఈ కార్యక్రమాలు నిషిద్ధం..!
మూఢంలో వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభాలు, శంఖుస్థాపనలు, యజ్ఞాలు, నూతన వధువు గృహప్రవేశం, యజ్ఞం, దీక్షోపనయనం, వాహనాలు కొనడం, వ్యాపార ప్రారంభాలు, మహాదానాలు, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, రాజ దర్శనం, రాజ్యాభిషేకం, బావులు చెరువులు తవ్వించడం వంటివి నిషిద్ధం.
