తమిళనాడు సీఎం విజయ్ తన ఎన్నికల హామీ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాడులను, నేరాలను అరికట్టేందుకు విజయ్ ప్రభుత్వం ‘సింగప్పెన్’ పేరుతో ఓ ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి విజయ్ ‘సింగప్పెన్’యూనిట్‌ను ప్రారంభించారు. పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక పోలీస్ యూనిట్ గా సింగప్పెన్ రూపుదిద్దుకుంది. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్‌తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్‌ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం.

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రతను పటిష్టం చేయడానికి, నేరాలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 354 కోట్లను కేటాయించిందని పేర్కొన్నారు. రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి అదనంగా 2,500 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. మహిళలపై జరిగే నేరాలకు కారకులైన వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా వేగవంతమైన దర్యాప్తు ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు.