ఇంటిలోని పోరు అంటే ఇంతింతకాదయా అన్న ప్రజాకవి వేమన మాటలు మనుషులకైనా..గొరిల్లాలకైనా ఒక్కటే అన్నట్లుగా కనిపిస్తుంది ఓ గొరిల్లా వ్యవహారం చూస్తే. జపాన్‌లోని హిగషియామా జూకు చెందిన ‘కియోమాసా’ అనే గొరిల్లాకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా తన లేడీ పార్ట్‌నర్‌తో గొడవపడి, ఒంటరిగా కూర్చొని బాధపడుతూ అచ్చం మనిషిలా అది ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లాంతో పేచి పెట్టుకుని తీవ్ర ఆలోచనలో పడిపోయిన ఆ గొరిల్లా వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది.

ఈ వైరల్ వీడియోను చూసిన వారు.. “భార్యతో పెట్టుకుంటే మనిషైనా, గొరిల్లా అయినా ఇదే పరిస్థితి” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సహజంగానే ప్రకృతి పరంగా గొరిల్లాలు అత్యంత శాంతియుతమైన, తెలివైన సామాజిక జీవులు. మానవులతో దాదాపు 98% వరకు డిఎన్ఎ (DNA) ను పంచుకుంటాయి. గుంపులుగా జీవిస్తూ, శాకాహారాన్ని తింటూ, రోజువారీ దినచర్యలో ఎక్కువ భాగం ఆహారం కోసం అన్వేషిస్తూ గడుపుతాయి. గొరిల్లా గుంపుకు మగ గొరిల్లాలు నాయకత్వం వహిస్తాయి.ఆడ గొరిల్లాలు పిల్లలను కని, వాటిని తమ వీపుపై మోస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి.

గొరిల్లాలు ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు, తమ గుండెలను గట్టిగా కొట్టుకోవడం ద్వారా తమ ఉనికిని, కోపాన్ని లేదా భయాన్ని వ్యక్తపరుస్తాయి. గొరిల్లాలు సాధారణంగా దాడి చేయవు. కానీ వాటిని బెదిరించినప్పుడు లేదా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే భయంకరమైన అరుపులతో స్పందిస్తాయి. అలాంటి మంచి గొరిల్లా ఒకటి పెళ్లంతో గొడవ పడి అశాంతికి గురవ్వడం వైరల్ గా మారింది.