Temples | అక్షయ తృతీయ..! ఇది ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు. ఈ రోజున ఎలాంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా రోజంతా అమృత ఘడియల కిందే పరిగణిస్తారు. సాధారణంగా ఏదైనా కొత్త పని మొదలుపెడితే తిథి, వారం, నక్షత్రం చూస్తారు. కానీ అక్షయ తృతీయ రోజు అవేమీ చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి క్షణం శుభముహూర్తమే.
Temples : అక్షయ తృతీయ..! ఇది ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు. ఈ రోజున ఎలాంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా రోజంతా అమృత ఘడియల కిందే పరిగణిస్తారు. సాధారణంగా ఏదైనా కొత్త పని మొదలుపెడితే తిథి, వారం, నక్షత్రం చూస్తారు. కానీ అక్షయ తృతీయ రోజు అవేమీ చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి క్షణం శుభముహూర్తమే. ఏ పని ప్రారంభించినా జయమే. అయితే ఈ రోజు కింది ఆలయాలను దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందట.
చార్ధామ్ క్షేత్రాలను సాధారణంగా దీపావళి నుంచి 6 నెలలపాటు మూసివేసి మళ్లీ అక్షయ తృతీయ సందర్భంగా తెరుస్తారు. మూసి ఉన్న ఆరు నెలల కాలంలో దేవతలంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని విశ్వాసం. ఆలయం మూసి వేసేటప్పుడు వెలిగించిన దీపం ఆరు నెలల తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు కూడా అలాగే ఉంటుంది. గంగోత్రి, యమునోత్రిని అక్షయతృతీయ రోజే తెరుస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సందర్భంగా చార్ధామ్ను సందర్శించవచ్చు.
ఆషాడమాసం రాగానే పూరీ జగన్నాథుడి రథాయాత్ర సందడి మొదలవుతుంది. అయితే ఆ రథాన్ని తయారుచేయడం ఏటా అక్షయ తృతీయ రోజు ప్రారంభిస్తారు. నిర్మాణానికి వినియోగించే దుంగలు తీసుకొచ్చి ప్రత్యేక పూజ చేసి రథ నిర్మాణం ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టిన రథనిర్మాణం ఆషాడం వచ్చేసరికి పూర్తవుతుంది. ఈ సందర్భంగా జగన్నాథుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయి.
ఏడాది మొత్తం లింగరూపంలో నిండుగా చందనంతో కప్పి ఉండే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రం నిజరూపంలో దర్శనమిస్తాడు. ఏడాదికోసారి కనిపించే ఈ దర్శనం కోసం భక్తులు పోటీపడతారు. వరాహం రూపం, మనిషి శరీరం, రెండు చేతులు పైకి కనిపిస్తాయి. కాళ్లు మాత్రం భూమిలో కూరుకుపోయినట్టు ఉంటాయి. ఈ నిజరూపం అక్షయతృతీయ ముందు రోజు అర్థరాత్రికల్లా స్వామిపై ఉన్న చందనం మొత్తం తొలగించడంతో కనిపిస్తుంది. కొన్ని గంటలపాటు మాత్రమే ఈ నిజరూపం దర్శనమిస్తుంది. ఆ తర్వాత మళ్లీ చందన లేపనం చేస్తారు.
తమిళనాడు కుంభకోణంలో గరుడసేవ అక్షయ తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజు సారంగపాణి ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం సహా మొత్తం 12 వైష్ణవ ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు ఒకేసారి గరుడవాహనంపై బయలుదేరుతారు. ఈ వేడుక చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
బృందావనంలో కొలువైన బృందావనమాలికి బంకే బిహారి అనే ఆలయం ఉంది. స్వామి హరిదాస్ నిర్మించిన ఆ క్షేత్రంలో కొలువైన గోపాలుడి పాద దర్శనం కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది. బృందావనంలో ఉన్న అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన బంకే బిహారి ఆలయంలో ఏడాది మొత్తం గోపాలుడి పాదాలు కమలాలతో కప్పి ఉంటాయి.
సంస్కృతంలో అక్షయ అంటే ‘ఎప్పటికీ తగ్గదు’ అని అర్థం. అందుకే ఈ రోజు దాన ధర్మాలు చేయడం, నూతన వ్యాపారాల ప్రారంభోత్సవం, నూతన గృహ నిర్మాణం చేయడం మంచిది. రోజు మొత్తం శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తే మంచి జరుగుతుంది.