Site icon vidhaatha

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడే ఆర్జిత టికెట్ల కోటా విడుదల..!

Tirumala | శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన దర్శనం, వసతి టికెట్ల కోటా విడుదల సమాచారాన్ని టీటీడీ వెల్లడించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను మంగళవారం విడుదల చేయనున్నది. సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నది. ఇందుకు బుధవారం ఉదయం 10 గంటలనుంచి 20న ఉదయం 10 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మూడురోజుల పాటు వివరాలను నమోదు చేసుకున్న భక్తులకు డిప్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ కేటాయించనున్నది. ఎలక్ట్రానిక్ డిప్‌లో ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20న మధ్యాహ్నం 12గంటల నుంచి 22న మధ్యాహ్నం 12గంటల వరకు టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణం ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవల్లో వర్చువల్‌గా పాల్గొనే భక్తుల కోసం ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనున్నది.

ఇక అంగ ప్రదక్షిణం టికెట్లను 22న ఉదయం 10గంటలకు విడుదల చేయనుంది. అదే రోజున మధ్యాహ్నం 3గంటలకు సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు స్పెషల్ దర్శనం కోసం టికెట్లను జారీ చేస్తుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24న ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నది. తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు కోటాను విడుదల చేయనున్నారు. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో ttdevasthanams.ap.gov.in బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ వివరించింది.

Exit mobile version