TTD | తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి జరుగనున్నాయి. ఉత్సవాలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, కల్యాణ కట్ట, గోశాల,శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానున్నాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సమావేశంలో ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్కుమార్, సీఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.