వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటాం. ఈ రోజున కచ్చితంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటేనే అవి అక్షయంగా ఉంటాయని నమ్మకం. అక్షయంగా అంటే బంగారం, వెండి తరగకుండా ఉంటాయనే మాట ప్రచారంలో ఉంది.
వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటాం. ఈ రోజున కచ్చితంగా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటేనే అవి అక్షయంగా ఉంటాయని నమ్మకం. అక్షయంగా అంటే బంగారం, వెండి తరగకుండా ఉంటాయనే మాట ప్రచారంలో ఉంది. మరీ అప్పు చేసి బంగారం, వెండి కొంటే అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయనేది మరిచపోవద్దు. వాస్తవానికి ప్రాచీనకాలంలో పెద్దగా ప్రాచుర్యం లేని అక్షయ తృతీయ మూడు దశాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పట్నుంచి అక్షయ తృతీయ రోజున బంగారం షాపులకు బారులు తీరుతున్నారు.
మత్స్యపురాణం అరవై ఐదవ అధ్యాయంలో ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈ రోజున అక్షయుడైన విష్ణువు ఆరాధన విశేషంగా జరుగుతుంది కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు.
అక్షతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యంతో అక్షింతలను తయారు చేయాలి. ఆ తర్వాత విష్ణు భగవానుని పాదాలపై ఉంచి, అనంతరం ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరాలి. ఆ బియ్యంలో కొంత బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి అక్షయ తృతీయ వ్రతం చేసిన ఫలం తప్పక కలుగుతుంది.
వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలని ఎక్కడా లేదు. ఇంకా ఈ రోజు దానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అనవసరంగా అప్పులు చేసైనా బంగారం కొనాలన్నా ఆలోచన విడిచి పెట్టి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ దానం చేయాలి. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలని చెబుతుంది. కానీ, సంపదలను పెంచుకోవాలని ఎక్కడా చెప్పలేదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈ రోజు దానధర్మాలు చేసి అక్షయమైన ఫలాన్ని పొందుదాం.