Basara IIIT | బాసర త్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. జూన్‌ 1 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Basara IIIT | బాసరలోని 'రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి వెంకటరమణ హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు.

Reported by: Thyagi | విద్య - ఉద్యోగం | May 28, 2024, 9:43 am IST
Read Time: 3 mins
Basara IIIT | బాసర త్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. జూన్‌ 1 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

Basara IIIT : బాసరలోని ‘రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 1 నుంచి 26 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు, వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి వెంకటరమణ హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా 1,500 సీట్లు అందుబాటులో ఉంటాయని వెంకటరమణ చెప్పారు. అందులో 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చని తెలిపారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్‌లో వివిధ బ్రాంచీల్లోని సీట్లను భర్తీ చేస్తామన్నారు. తొలి ఏడాదికి ఫీజు రూ.37 వేలు ఉండగా రీయింబర్స్‌మెంట్‌ అర్హత ఉన్న వారు ఆ రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

అయితే రిజిస్ట్రేషన్‌ ఫీజు వెయ్యి రూపాయలు, కాషన్‌ డిపాజిట్‌ రూ.2 వేలు, ఆరోగ్య బీమా కింద రూ.700.. ఇలా మొత్తం రూ.3,700 మాత్రం ప్రతి ఒక్కరూ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ముఖ్య తేదీలు..

దరఖాస్తులు ప్రారంభం : జూన్‌ 1 నుంచి
దరఖాస్తులకు గడువు : జూన్‌ 26 సాయంత్రం 5 గంటల వరకు
సీట్ల కేటాయింపు : జూలై 3న
ధ్రువపత్రాల పరిశీలన : జూలై 8 నుంచి 10 వరకు

ముఖ్యాంశాలు..

ఈ ఏడాది తొలి ప్రయత్నంలో పదో తరగతి పాసైన వారే దరఖాస్తు చేసేందుకు అర్హులు. వయసు జూన్‌ 1 నాటికి 18 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది.

గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద కేటాయిస్తారు. పూర్తి వివరాలను ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.