TS 10th results | తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో 91.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18నుంచి ఏప్రిల్ 2వరకు నిర్వహించిన పది పరీక్షల ఫలితాల్లో 91.31 ఉత్తీర్ణత శాతం నమోదవ్వగా, బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
నిర్మల్ జిల్లా టాప్..సత్తా చాటిన గురుకులాలు
పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడు స్థానంలో నిలిచింది. ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. 98.71 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. టీఎస్ రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పరిషత్, గవర్నమెంట్, ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణతా శాతం 91.31 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి.
జూన్ 3నుంచి 13వరకు సప్లిమెంటరీ పరీక్షలు
పదవ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్కు రూ. 500, రీవెరిఫికేషన్కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.