Akhanda 2 | ‘అఖండ 2’ విడుదలైన తర్వాత సినిమా కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, ఫ్యాన్ వార్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. సినిమాలో బాలయ్య త్రిశూలంతో, గన్స్తో వందల మందిని ఎదుర్కోవడం, ప్లాష్మ్యాన్, సూపర్మ్యాన్లా ఎగిరి ఎగిరి శత్రువులను నేలకూల్చడం వంటి సీన్స్కు అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం “ఇది సినిమా కాదు, కార్టూన్” అంటూ ట్రోలింగ్కు దిగారు. ముఖ్యంగా మెగా అభిమానుల నుంచి విమర్శలు ఎక్కువగా రావడంతో, వ్యవహారం కాస్తా ఫ్యాన్ వార్గా మారిపోయింది.
బోయపాటి – బాలయ్య కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను “వెర్రి పుష్పాలు” చేస్తోందంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి అతిశయోక్తి సీన్స్తో తెలుగు సినిమాల పరువును తీస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాదు, బాలయ్య గత సినిమాల్లోని తొడకొట్టి ట్రైన్ను వెనక్కి పంపడం, బైక్తో ట్రైన్ మీద నుంచి దూకడం, చేతులతోనే కొండ ఎక్కేయడం వంటి సన్నివేశాలను క్లిప్స్గా మార్చి వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన నందమూరి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. నందమూరి ఫ్యాన్స్ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. చిరంజీవి సినిమాల నుంచి హెలికాప్టర్ను నాగలితో కొట్టి పేల్చే సీన్, ‘స్టాలిన్’లో ఫుల్ స్పీడ్లో వెళ్తున్న కారులో నుంచి మరో కారులోకి దూకే సీన్, ట్రైన్ వస్తుండగా వంతెనపై పరుగెత్తే సీన్స్ను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ “ఇవి లాజికల్గా ఉన్నాయా?” అంటూ మెగా స్టార్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇలా మొదలైన ఈ ట్రోలింగ్ కాస్తా నందమూరి – మెగా అభిమానుల మధ్య పూర్తి స్థాయి ఫ్యాన్ వార్గా మారిపోయింది. మాస్ సినిమాల్లో ఎలివేషన్స్, అతిశయోక్తి సీన్స్ కొత్తేమీ కావు. దశాబ్దాలుగా ఇవే తెలుగు సినిమాలకు ఊపిరిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుని హీరోల మధ్య పోలికలు పెడుతూ పరస్పరం తిట్టుకోవడం దురదృష్టకరంగా మారింది. విచారకరమైన విషయం ఏమిటంటే… ఈ ఫ్యాన్ వార్లో ఎవరు గెలిచారన్నది కాదు, చివరికి నష్టపోతున్నది మాత్రం ఆయా హీరోల ప్రతిష్ఠే. బాలయ్య, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును, అభిమానులే సోషల్ మీడియాలో దెబ్బతీస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా నచ్చితే చూడాలి, నచ్చకపోతే వదిలేయాలి. అంతేగానీ హీరోల పేర్లతో యుద్ధం చేయడం వల్ల లాభం ఎవరికీ లేదు. ‘అఖండ 2’తో మొదలైన ఈ ట్రోలింగ్ ట్రెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
