Pushap 2 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప 2’ విడుదలై నేటికి ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే సినిమా విడుదల రోజు హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చాలా మందిని కలిచివేసింది. అభిమానుల భారీ రద్దీతో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందగా, ఆమె కుమారుడు చిన్నారి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అప్పటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ జైలుకూ వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంవత్సరం పూర్తవుతున్నా, చిన్నారి శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవడం కుటుంబానికి, అభిమానులకు కూడా చాలా బాధకరం.
బన్నీ వాసు స్పందన
తాజాగా ‘ఈషా’ మూవీ టీజర్ ఈవెంట్కు నిర్మాత బన్నీ వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ప్రమాదంపై ఆయన స్పందించారు. నిర్మాత దిల్రాజు గారు, ఇతర పెద్దలు ఈ సంఘటనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇరు వైపుల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చినా మాట్లాడుకుని ముందుకు వెళ్తున్నాం. బాధిత కుటుంబం పూర్తిగా సంతృప్తిగా ఉందా అనే విషయంలో కొన్ని మార్గదర్శకాలు పాటిస్తున్నాం. ఆస్పత్రి ఖర్చులు ఎంత ఇవ్వాలి? నెలవారీ ఖర్చులకు ఎంత సహాయం చేయాలి? అన్న విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. అవసరం ఉంటే పెద్దలు వచ్చి మాట్లాడొచ్చు. ఎలాంటి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ విషయంపై ఇక్కడ మరింత మాట్లాడటం సరికాదు” అని వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా పుష్ప2 చిత్రం సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్లోను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
