Kamal Hassan | భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లపై విశ్వనటుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు సినీ రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంటూ ఆయన పరిశ్రమకు ఒక సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు.
ప్రస్తుత పరిస్థితులు కేవలం రాజకీయ అంశాలకే పరిమితం కావని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమై ఉన్న సినిమా పరిశ్రమ కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కమల్ వివరించారు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
కమల్ ఆందోళన…
ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడంతో పాటు, సినిమా సెట్ల నిర్మాణం, షూటింగ్ ప్రయాణాలు, రోజువారీ నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడే అస్థిరత స్థానిక చిత్ర నిర్మాణ బడ్జెట్లపై నేరుగా ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషించారు.
ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సినిమాల నిర్మాతలు ఈ పరిస్థితుల్లో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని కమల్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ వ్యయాలు నియంత్రణ తప్పితే దాని ప్రభావం కార్మికులు, సాంకేతిక నిపుణులు, చిత్ర నిర్మాణంతో ముడిపడిన వేలాది కుటుంబాలపై పడే ప్రమాదం ఉందని చెప్పారు.
అందరు ఒకే వేదికపైకి రావాలి..
అంతేకాకుండా విదేశీ షూటింగ్లు, అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థలు కూడా ఈ పరిస్థితుల కారణంగా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటులు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, ఇతర భాగస్వాములు కలిసి అత్యవసర సమావేశాలు నిర్వహించి బడ్జెట్ నియంత్రణ, భవిష్యత్ వ్యూహాలపై చర్చించాలని కమల్ సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, లక్షలాది మంది జీవనోపాధికి ఆధారమైన వ్యవస్థ అని కమల్ హాసన్ గుర్తుచేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ మొత్తం సమిష్టిగా ముందుకు వస్తేనే భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.
