Mahesh Babu | సినిమా అభిమానుల్లో హీరోపట్ల అభిమానాన్ని వ్యక్తం చేసే విధానం కొన్నిసార్లు పైశాచికంగా మారుతుంది. కొందరు పలు సందర్భాల్లో సామాజిక కార్యక్రమాలు చేయగా, మరికొన్ని సందర్భాల్లో అత్యుత్సాహంతో ప్రమాదకర చర్యలకు కూడా దిగుతున్నారు.. అటువంటి సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో చోటుచేసుకుంది.
నెత్తుటితో మహేష్ ఫ్లెక్సీకి బొట్టు
అమలాపురంలో మహేష్ బాబు అభిమానిలో ఒకరు తన అభిమానాన్ని వినూత్నంగా చాటాలని అనుకున్నాడు. బీర్ బాటిల్తో స్వయంగా తన తల పగలగొట్టుకుని, కారుతున్న రక్తంతో మహేష్ బాబు ఫ్లెక్సీపై బొట్టుపెట్టి హంగామా సృష్టించారు. బిజినెస్మెన్ ప్రీ రీలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది. “బాబులకే బాబు మహేష్ బాబు తోపు” అంటూ నినాదాలు చేస్తూ, అభిమానితో పాటు పలు మంది అక్కడ గుమికూడగా ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
చూసిన జనాలు భయంతో పక్కకు… పోలీసులు అరెస్ట్
ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై దూరంగా జరిగిపోయారు. అక్కడ గుమికూడిన అభిమానుల్లో కొంత సేపు గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.పోలీసులు అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, ప్రమాదకరమైన చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు సమాచారం.
అభిమానుల్లో అత్యుత్సాహం పెరిగిపోతుందా?
సెలబ్రిటీలపై అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించడం ప్రమాదకరం మాత్రమే కాక, సామాజికంగా కూడా అనారోగ్యకరమైనదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నటులు ఎన్నిసార్లు అభిమానులను హింసాత్మక లేదా ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండమని కోరుతున్నా… ఇటువంటి సంఘటనలు ఇంకా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే భారీ ప్రాజెక్ట్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి గ్రాండ్ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరు కావడం మనం చూశాం.
