Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన ‘పెద్ది’ ప్రమోషనల్ ఈవెంట్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ వేడుకలో రామ్ చరణ్ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్లో భాగంగా స్టేజ్పై ఉన్న యాంకర్, భారత స్టార్ క్రికెటర్ల గురించి ఒక్క మాటలో తన అభిప్రాయాన్ని చెప్పాలని రామ్ చరణ్ను కోరారు. మొదట భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతూ, ఆయనను “ఒక లెజెండ్”గా అభివర్ణించారు. మహేంద్ర సింగ్ ధోని గురించి “కామ్ అండ్ కంపోజ్డ్” అని, రోహిత్ శర్మ గురించి “అందరివాడు” అని పేర్కొన్నారు. అలాగే విరాట్ కోహ్లీని “ఒక ఫైర్” అంటూ ప్రశంసించారు.
బుమ్రా విషయంలో తప్పిందం…
అయితే చివర్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావనకు రాగానే చరణ్ అనుకోకుండా పొరపాటు చేశారు. “బుమ్రాకు నేను పెద్ద అభిమానిని. అతను అద్భుతంగా ఫుట్బాల్ ఆడతాడు. ఫుట్బాల్ను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడు” అంటూ వ్యాఖ్యానించారు. భారత జట్టులో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన బుమ్రాను ఫుట్బాల్ ప్లేయర్గా పేర్కొనడం అక్కడున్నవారితో పాటు సోషల్ మీడియా వినియోగదారులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారింది. “బుమ్రా ఎప్పటి నుంచి ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు?”, “టీమిండియా స్టార్ బౌలర్ను ఇలా ఎలా కన్ఫ్యూజ్ అయ్యారు?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ భారీగా షేర్ అవుతున్నాయి.
వెంటనే క్షమాపణలు
విషయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ తన ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టారు. బుమ్రాను ట్యాగ్ చేస్తూ.. ఆయన సాధించిన విజయాలు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాయని, మైదానంలో ఆయన ఆటకు తాను వీరాభిమానిని అంటూ చరణ్ తెలియజేస్తూ వివాదానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
మరోవైపు రామ్ చరణ్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. చరణ్ గతంలో కూడా తనకు పేర్లు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బందులు ఉంటాయని అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తుచేస్తున్నారు. హిందీలో ఎక్కువసేపు మాట్లాడటం వల్ల కొంత ఒత్తిడికి గురై పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే భోపాల్లో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్ మాత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, నటుడు మరియు ఎంపీ రవికిషన్ పాల్గొన్నారు. అభిమానుల భారీ స్పందన మధ్య జరిగిన ఈ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కాగా, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
