Ram Gopal Varma | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సాధారణంగా సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ, తాజాగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. “నాయకుడి మాటే శిరోధార్యం. ఆయన చూపిన మార్గంలోనే నడవాలి. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి” అనే భావంతో ఆయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ ట్వీట్లో పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా షేర్ చేశారు.
మేము గొర్రెలం కాదు..
నాగబాబు వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. “మేము గొర్రెలం కాదు, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వైరల్గా మారగా, అనేక మంది ఆయన అభిప్రాయానికి మద్దతు పలికారు.
ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. “ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని ఇస్తారు. కానీ అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భిన్నాభిప్రాయాలు…
గతంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అంశాలపై తరచూ స్పందించిన ఆర్జీవీ, ఇటీవల కొంతకాలంగా అలాంటి వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు ట్వీట్, ప్రకాష్ రాజ్ స్పందన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు తెరలేపాయి.
ఆర్జీవీ ట్వీట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసినందుకు ఆయనను ప్రశంసిస్తుండగా, మరికొందరు దీనిపై విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఈ సోషల్ మీడియా వార్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.