మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవం. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి శరీర భాగాలకు సరఫరా చేయడంలో మూత్రపిండాల పాత్ర గణనీయమైనది
మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవం. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి శరీర భాగాలకు సరఫరా చేయడంలో మూత్రపిండాల పాత్ర గణనీయమైనది. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపి మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి మూత్రపిండాలు. అటువంటి మూత్రపిండాల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం మంచిది కాదు.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం తీసుకునే ఆహారం పట్ల కూడా అవగాహన ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధి బాధితులు ఈ ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. అధిక సోడియం ఉన్న ఆహారం, ప్రాసెస్ చేసిన మాంసం, కార్బోనేటేడ్ పానీయాలను అస్సలు ముట్టొద్దు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకున్నట్లయితే అధిక బీపీ సమస్యతో బాధపడాల్సి వస్తుంది. ఇది మూత్రపిండాలపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.
కొంతమందికి భోజనం చేసేటప్పుడు పచ్చళ్లు లేనిదే నోట్లోకి ముద్ద వెళ్లదు. కానీ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పచ్చళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ ఊరగాయల్లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి. ఇక ప్రాసెస్ చేసిన మాంసంలో కూడా ఉప్పు ఎక్కువగా కలుపుతుంటారు. ఇలాంటి మాంసాన్ని తినడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి ప్రాసెస్ మాంసానికి కూడా దూరంగా ఉంటే మంచిది.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పప్పులు, బీన్స్ వంటి వాటిని మెనూ నుంచి తొలగించాలి. అరటిపండు, బంగాళదుంపలను కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.
ఫాస్పేట్ ఉండే పదార్థాలను కూడా తీసుకోకూడదు. తీపి సోడా, కోలా వంటి శీతల పానీయాల్లో ఫాస్పేట్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. వీటిలో ఉండే ఫ్రక్టోజ్ కిడ్నీలకు అత్యంత ప్రమాదకరం. ఎక్కువ ఫాస్పరస్ ఉన్న ఆహారం శరీరానికి హానికరం. గింజలు, తృణధాన్యాలు, కార్బోనేటేడ్ పానీయాలు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా మితంగా తీసుకోవాలి. కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేషన్గా మారుస్తుంది. అంతేకాదు రక్తపోటును పెంచుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కెఫిన్కూ దూరంగా ఉండటం మంచిది. ఇలా వీటన్నింటికి దూరంగా ఉంటే పది కాలాల పాటు మూత్రపిండాలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.