Health Warnings | ఇక సమోసా, జిలేబీలపై సిగరెట్ పెట్టె తరహా హెచ్చరికలు!
భారత ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త ప్రచారం ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ చూడని విధంగా సంప్రదాయ ఆహారాలపై ప్రజలను హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. తిను..కానీ, తెలుసుకుని తిను అనేదే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యం.
Adharva / Health News / 15 July 2025
⦁ సిగరెట్ల తరహాలో ఆహార హెచ్చరికలు
⦁ నాగపూర్లో ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ
⦁ దశలవారీగా దేశం మొత్తం అమలు
Health Warnings | విధాత హెల్త్ డెస్క్: “ఇది తినడానికి రుచికరమైనదైనా… ఆరోగ్యానికి ప్రమాదకరం!” – ఇకపై ఈ తరహా హెచ్చరికలు సిగరెట్ ప్యాకెట్లపై మాత్రమే కాదు, మనకు రోజూ అలవాటైన సమోసా, జిలేబీ, వడపావ్, చాయ్ బిస్కెట్లపై కూడా కనిపించబోతున్నాయి. భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ కొత్త ప్రచారం ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ చూడని విధంగా పారంపర్యపు ఆహారాలపై ప్రజలను హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. ఈ నూతన చర్యకు AIIMS నాగ్పూర్ మొట్టమొదటి వేదికగా ఎంపికైంది. అక్కడి క్యాంటీన్లు, హాస్పిటల్ ఫుడ్ స్టాళ్లు, ప్రజా ఆహార కేంద్రాల్లో ఇప్పుడు “సిగరెట్ స్టైల్” ఆరోగ్య హెచ్చరికల బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇవి తిన్న పదార్థాల్లోని అధిక కొవ్వు (Fat), చక్కెర (Sugar), ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans Fats) శాతం, వాటి వల్ల కలిగే ఆరోగ్య హానిని స్పష్టంగా వివరించనున్నాయి.
ప్రజారోగ్యం కోసం ముందడుగు
ఈ వినూత్న చర్య వెనుక ముఖ్య ఉద్దేశ్యం – ఆహార విషయంలో ప్రజల్లో అవగాహన పెంచడం. ఈ హెచ్చరికలు తినే వస్తువులపై నిషేధం విధించడం కాదు. వాటిని మితంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేయడమే. అంటే, “తినొచ్చు… కానీ తెలుసుకొని తినండి” అన్నది ప్రభుత్వ సందేశం. ప్రముఖ పోషకాహార నిపుణుల ప్రకారం, నేటి జీవనశైలిలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. దీని ప్రధాన కారణం – అలవాటైన, రుచికరమైన కానీ అధిక కాలరీలు, కొవ్వులు కలిగిన చిరుతిళ్లు. లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారత్లో సుమారు 40 కోట్ల మంది ఊబకాయంతో బాధపడే అవకాశముందని అంచనా.
AIIMS నాగ్పూర్లో ఎలా అమలు చేస్తున్నారు?
నాగ్పూర్లోని ఎయిమ్స్లో ఇప్పుడు:
⦁ సమోసా, జిలేబీ, వడపావ్ వంటి స్నాక్స్ పక్కన తెరపై కనిపించే విధంగా హెచ్చరికలు ఉన్నాయి
⦁ ప్రతి వంటకంలో చక్కెర, నూనె, ట్రాన్స్ ఫ్యాట్ శాతం వెల్లడించబడుతోంది
⦁ హెచ్చరికలు “దీర్ఘకాలికంగా అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం” అనే సందేశాలతో ఉన్నాయి
⦁ కస్టమర్లకు తినే ముందు ఆ ఆహార పదార్థం శరీరంపై ప్రభావం ఏవిధంగా ఉంటుందో చెప్పేలా రూపొందించబడ్డాయి
ఇవి కఠినంగానే ఉన్నా… ప్రభుత్వం మాత్రం, ఇది నిషేధం కాదు. సంప్రదాయమైన ఆహారాన్ని పూర్తిగా నిరాకరించడం కాదు. మితంగా, అవగాహనతో తినే అలవాటు కల్పించడమే అసలైన ఉద్దేశ్యం అని స్పష్టంగా చెబుతోంది.
ప్రజల్లో స్పందన ఎలా ఉంది?
ఒకవైపు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇది మన ఆరోగ్య భవిష్యత్తును గమనించి తీసుకున్న ప్రముఖ ప్రజా ఆరోగ్య చొరవగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు, కొంతమంది వినియోగదారులు దీనిని సంప్రదాయ ఆహారాల మీద కఠినత్వంగా భావిస్తున్నారు.
తదుపరి దశ – దేశవ్యాప్తం
AIIMS నాగ్పూర్ లో ప్రారంభమైన ఈ హెచ్చరికల ప్రచారం త్వరలోనే ఇతర వైద్య సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీలు, పాఠశాలలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వరకు విస్తరించనుంది.
ప్రభుత్వం ఆశించేది ఏమిటంటే – ఈ హెచ్చరికలను చూసే ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలి: “ఇది తినే ముందు… ఇది నా శరీరానికి అవసరమా?”
ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా, మన దైనందిన జీవితంలో భాగమైపోయిన జంక్ఫుడ్ ఇప్పుడు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా యువత ఒకరకంగా వీటికి బానిసలైపోయారు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, కేక్లు..ఇలా విచ్చలవిడిగా బేకరీల్లో, కేఫ్ల్లో, రెస్టారెంట్లలో తింటూ కనిపిస్తున్నారు. అందుకే యువతలోనే ఊబకాయం ఎక్కువ కనిపిస్తోంది. దీన్ని కట్టడి చేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ఆహారంలో నూనె, చక్కెరలను తగ్గించాల్సిందిగా జాతీయ పోషకాహార సంస్థ భారత ప్రజలకు గట్టిగానే సూచించింది. పాటిస్తే మంచిదే కదా.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram