Mpox Clade 1 । భారతదేశంలో మొట్టమొదటి ఎంపాక్స్ క్లాడ్ 1 కేసు సోమవారం నమోదైంది. ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసు కేరళలో ఒక వ్యక్తిలో కనుగొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మళప్పురం వచ్చిన 38 ఏళ్ల వ్యక్తిలో ఈ వైరస్ను కనుగొన్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపాయి.
‘గత నెలలో డబ్ల్యూహెచ్వో రెండోసారి ఈ వైరస్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత భారతదేశంలో నమోదైన తొలి కేసు ఇదే’ అని అధికారవర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఎంపాక్స్ కేసు ఢిల్లీలో వెలుగు చూసింది. హర్యానాలోని హిస్సార్కు చెందిన 26 ఏళ్ల వ్యక్తికి ఎంపాక్స్ క్లాడ్ 2 స్ట్రెయిన్ ఉన్నట్టు గుర్తించారు. క్లాడ్ 2 స్ట్రెయిన్ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వ్యాపిస్తున్నది. 2022లో ఎంపాక్స్ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డబ్ల్యూహెచ్వో ప్రకటించిన తర్వాత భారత్లో మొత్తం 30 కేసులు నమోదయ్యాయి.