• Telugu News
  • /Hyderabad

Hyderabad Alert | హైదరాబాద్​ అత్యంత అప్రమత్తం : పోలీసుల విస్తృత తనిఖీలు

దేశ రాజధానిలో జరిగిన పేలుడు నగర పోలీసులను అప్రమత్తం చేయడమే కాకుండా, హైదరాబాద్‌లోని భద్రతా వ్యవస్థలో తక్షణ కదలిక తెచ్చింది. నగరంలో సీసీటీవీ నిఘా, పోలీసు పహారా రెండూ నిరంతరంగా  కొనసాగుతున్నాయి.

Reported by: ADHARVA | హైదరాబాద్​ | Nov 10, 2025, 10:43 pm IST
Read Time: 5 mins
Hyderabad Alert | హైదరాబాద్​ అత్యంత అప్రమత్తం : పోలీసుల విస్తృత తనిఖీలు

High Alert In Hyderabad After Delhi Blast: City Under Tight Vigil, Nakabandi At Key Locations

(విధాత సిటీ బ్యూరో)

హైదరాబాద్‌, నవంబర్‌ 10:
Hyderabad Alert | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం లాల్‌కిల్లా మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగిన కారు పేలుడు ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఢిల్లీలో ఎనిమిది మంది మృతి చెందిన ఈ ఘోర ఘటన తరువాత హైదరాబాద్‌లో కూడా హై అలర్ట్‌ ప్రకటించబడింది. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు రాత్రి నుంచి నగరమంతా నాకాబందీ అమలు చేశారు.

ALSO READ : Delhi Car Bomb blast | ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు : 13మంది మృతి

హైదరాబాద్‌ రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు – హోటళ్లలో పరిశీలన

ఢిల్లీ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు రాత్రి 7 గంటల నుంచే రహదారులు, మార్కెట్లు, బస్సు టర్మినల్స్‌, మెట్రో స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనాలను ఆపి నిశితంగా చెక్‌ చేస్తున్నారు. నగరంలోని ప్రధాన లాడ్జ్‌లు, హోటళ్లలో రిజిస్టర్‌ ఎంట్రీలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు.

నగర కమిషనర్​ సీపీ సజ్జనార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనబడితే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వండి. మేము నిరంతరం పహారా నిర్వహిస్తున్నాము” అన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం నుంచి బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, సికింద్రాబాద్‌, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో నాకా బందీలు కొనసాగుతున్నాయి. అత్యంత సున్నితప్రాంతమైన పాతబస్తీలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. రద్దీప్రాంతాల్లో అన్ని వాహనాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమాస్పదంగా కనిపించిన వ్యక్తులను విచారిస్తున్నారు.

Police on high alert near charminar

జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక సందర్భంగా భద్రత మరింత పెంపు

రెడ్‌ఫోర్ట్‌ పేలుడు ముందు నుంచే హైదరాబాద్‌ పోలీసులు జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక దృష్ట్యా అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఎన్నికకు ముందు భద్రతా వలయం ఏర్పాటుచేసిన నేపథ్యంలో, ఢిల్లీ ఘటన తరువాత దానిని మరింత పెంచారు.

సీనియర్‌ పోలీసు అధికారులు, అన్ని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు (SHOs) ప్రత్యేక సూచనలు జారీ చేశారు. కేవలం జూబ్లీహిల్స్‌ పరిసరాల్లోనే కాకుండా  అన్ని చోట్లా ప్రతి వాహనం, లాడ్జ్‌, హోటల్‌, గెస్ట్‌ హౌస్‌ తనిఖీ చేయాల్సిందిగా, రాత్రిపూట పహారా నిరంతరంగా జరగాలని ఆదేశాలు ఇచ్చారు.  పోలీసు ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని సిబ్బందిని సమావేశపరిచి, ఢిల్లీ ఘటన వివరాలను వివరించారు. అదనంగా ఇంటెలిజెన్స్‌ యూనిట్లు హైదరాబాద్లో అనుమానాస్పద కదలికలపై నిఘా వేశారు.