విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల సహా 58మంది పోటీలో మిగిలారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా 23మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు కాసేపట్లో ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించనున్నారు. ఆర్ఆర్ఆర్, ఫార్మా సిటీ బాధిత రైతులు, గ్రూప్ 1 అభ్యర్థులు, మాల మహానాడు సహా పలువురు స్వతంత్రులు సహా ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 211మంది 321 నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ పిదప రంగంలో ఉన్న 81మంది అభ్యర్థులలో 23మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిలు బరిలో ఉన్నారు. నవంబర్ 11 న పోలింగ్, నవంబర్ 14 న కౌంటింగ్ జరుగనుంది. ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది.