ఉప్పల్ రోడ్లపై ఎత్తిపోతలు..ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో ప్రజలకు తిప్పలు

ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల ఆలస్యంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. వర్షాలతో రోడ్లపై నీరు నిలిచి అధికారులు ఎత్తిపోతలు చేపడుతుండగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jul 29, 2026, 6:27 pm IST
Read Time: 4 mins
ఉప్పల్ రోడ్లపై ఎత్తిపోతలు..ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో ప్రజలకు తిప్పలు

నగరంలోని ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల ఆలస్యం ప్రజలను, ప్రయాణికులను, వాహనదారులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుంది. వర్షకాలంలో ఈ కష్టాలు మరింత అధికమయ్యాయి. ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు రాకపోకలను నిలిపి వేసి..ట్రాఫిక్ మళ్లించిన అధికారులు వాహనదారులకు, ప్రయాణికులకు నిత్యం ట్రాఫిక్ జామ్ లతో చుక్కలు చూపిస్తున్నారు.

తాజా వర్షాలతో ఫ్లై ఓవర్ పిల్లర్ల నిర్మాణ ప్రాంతాల్లోని రహదారిపై గుంతల్లో భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో రోడ్లపై భారీగా నిలిచిన వరద నీటిని అధికారులు మోటార్లు పెట్టి ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోసిన వరద నీరు రోడ్డుపైన ప్రవహిస్తుండటంతో వాహనదారులు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఉప్పల్ ఫ్లై ఓవర్ మార్గంలో రోడ్లపై నీటిని ఎత్తిపోయడం చూసిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై సెటర్లతో విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిజర్వాయర్లు, నదుల నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే..రోడ్లపై నీళ్లు ఎత్తిపోస్తున్నారంటూ సెటైర్లు విసురుతున్నారు.

2018 జూలైలో ప్రారంభమైన ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా 8 ఏళ్లుగా నత్తనడకన సాగుతూ.. స్థానికులతో పాటు వాహనదారుల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత దసరాకే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని గొప్పగా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ సాగుతున్న పనులు చూస్తుంటే 2027 దసరాకు కూడా ఈ ఫ్లై ఓవర్ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. మంత్రి కోమటిరెడ్డి మరోసారి వచ్చి ఈ ఫ్లై ఓవర్ పనుల దుస్థితిని, ప్రజలు, వాహనదారుల కష్టాలను చూడాలని డిమాండ్ చేస్తున్నారు.