Bluefin Tuna Fish | సాధారణంగా చేప ధర ఎంత ఉంటుంది..? మహా అయితే కేజీ రూ.200 నుంచి రూ.600 వరకూ ఉంటుంది. పులస చేప అయితే రూ.వేలల్లోనే పలుకుతుంది. కానీ జపాన్ రాజధాని టోక్యోలో ఓ చేప ఏకంగా రూ.29 కోట్ల ధర పలికింది.
బ్లూఫిన్ ట్యూనా చేప (Bluefin Tuna Fish) .. ప్రపంచంలోనే అతి ఖరీదైన, విలువైనదిగా ఈ చేప ప్రసిద్ధి. 2026 కొత్త సంవత్సర ప్రారంభం సందర్భంగా రాజధాని టోక్యోలోని టొయోసు చేపల మార్కెట్లో జరిగిన వేలం పాటలో ఈ ట్యూనా ఫిష్ భారీ ధర పలకడం విశేషం. ఈ ఏడాది జరిగిన తొలి వేలంలో 243 కిలోలు ఉన్న ఈ చేప 510 మిలియన్ యెన్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.29 కోట్లకు పైమాటే. ఈ చేపను ప్రముఖ సుషీజన్మయి సుషి రెస్టారెంట్ చైన్కు చెందిన కియోమూరా కార్పొరేషన్ భారీ ధర చెల్లించి దక్కించుకుంది. కొత్త ఏడాదిలో వచ్చే తొలి ట్యూనా చేప అదృష్టాన్ని తీసుకొస్తుందని జపనీయులు విశ్వసిస్తుంటారు. అందుకే వేలంలో దాన్ని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఏటా కొత్త ఏడాది ఆరంభంలో ఇక్కడ ట్యూనా చేపల వేలం (Year Opening Auction) జరుగుతుంటుంది.
సాధారణంగానే చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ ఈ ట్యూనా చేపలు (Tuna Fish) మన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుస్తాయి. ట్యూనా చేప అనేది స్కాంబ్రిడే కుటుంబానికి చెందిన రుచికరమైన, పోషకాలు అధికంగా ఉండే ఉప్పునీటి చేప. ప్రపంచంలోనే అతి ఖరీదైన, విలువైనదిగా ఈ చేప ప్రసిద్ధి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ ట్యూనా ఫిష్ మన శరీరానికి కావల్సిన ప్రోటీన్ అవసరాలను తీరుస్తుంది. ఈ చేపను సలాడ్స్, సుషీ, స్టీక్స్ వంటి వంటకాల్లో ఉపయోగిస్తుంటారు.
ఇవి కూడా చదవండి :
Prabhas | ప్రభాస్ జోకర్ గెటప్ ఆలోచన మారుతిదీ కాదా.. ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Haryana Couple Welcome a Son | పెళ్లైన 19 ఏండ్లకు.. 11వ కాన్పులో మగబిడ్డ..! వీడు మగాడ్రా బుజ్జి..!!
