Boat accident : ప్రమాదవశాత్తు వేర్వేరు ప్రాంతాల్లో రెండు నౌకలు మునిగిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 64 మంది సముద్రంలో గల్లంతయ్యారు. ఇటలీ దక్షిణ తీరంలో సోమవారం ఈ రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఘటనలు జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఆయా ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఇప్పటివరకు రక్షణ బృందాలకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 64 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇటాలియన్ కోస్ట్గార్డ్ సోమవారం అర్థరాత్రి వరకు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. దక్షిణ ఇటలీలోని కాలాబ్రియా తీరానికి 120 మైళ్ల (193 కిలోమీటర్ల) దూరంలో మునిగిపోయిన పడవ గురించి సమాచారం అందుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.
మర్చంట్ షిప్ కొంతమందిని కాపాడింది. నౌక మునిగిపోవడంతో ప్రాణాలతో బయటపడిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు కోస్ట్ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు ఇటాలియన్ పెట్రోలింగ్ బోట్లు, ATR 42 విమానం ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. సోమవారం సాయంత్రం వరకు ఎవరూ సజీవంగా కనిపించలేదు. ఇరాక్, సిరియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలసదారులు, శరణార్థులను తీసుకువెళుతున్న పడవ గత వారం టర్కీ నుంచి బయలుదేరిందని, ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్పారు.
ఇటలీ దక్షిణ ద్వీపం లాంపెడుసా నుంచి మాల్టా సమీపంలో ఒక పడవలో ఉన్న మరో 51 మందిని రక్షించగలిగారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఈజిప్ట్, సిరియా నివాసితులు ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యధరా సముద్రంలో పడవలో ప్రయాణించే వలసదారులు వాతావరణ ప్రభావం, నాణ్యతలేని నౌకల కారణంగా ఇలాంటి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు సముద్రం దాటుతూ దాదాపు వెయ్యి మంది మరణించారు.