Site icon vidhaatha

Rishi Sunak | సాధించాలంటే సాహసం చేయాలి.. బ్రిటన్‌ ప్రధాని దంపతుల ఆసక్తికర పోస్టు

Rishi Sunak : మరికొన్ని రోజుల్లో బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ దంపతులు (Rishi Sunak and Akshata Murty) కీలక విషయాలు సోషల్‌ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. ఇద్దరి అభిరుచులకు సంబంధించి అనేక మంది అడిగే ప్రశ్నలను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు.

దాంపత్య జీవితంలో వారి అభిరుచులు, పనిపట్ల నిబద్ధత, తాము అనుసరించే మానవ విలువల గురించి తమ పోస్టులో వివరించారు. ‘మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్లినా ఇతరుల నుంచి ఎదురయ్యే మొదటి ప్రశ్న.. ‘మీలో కామన్‌గా కనిపించే విషయం ఏంటి..?’ అని. దాంపత్య జీవితంలో కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఉంది. అదే విలువలను పంచుకోవడం. జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుంది. దాన్నే మేమిద్దరం విశ్వసిస్తాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

అదేవిధంగా ‘ఏదైనా సాధించాలంటే మాత్రం సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమనే విషయంలోనూ ఇద్దరిదీ ఒకటే మాట. దాని ఫలితంగా మనకంటే మెరుగైన ప్రపంచాన్ని మన పిల్లలు వారసత్వంగా పొందుతారని మా విశ్వాసం. ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం అనే విలువలను పిల్లలకు పంచుతున్నాం’ అని రిషి సునాక్‌ దంపతులు తమ పోస్టులో తెలియజేశారు.

రిషి, అక్షతా సంయుక్తంగా పెట్టిన ఈ పోస్టుకు తమ ఫొటోను జత చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దాంపత్య జీవితంలో పాటిస్తున్న విలువలు, సహకారం, భవిష్యత్తుపై వారికి ఉన్న నిబద్ధత, ముందుచూపుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుంటే జులై 4న యూకేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భర్త సునాక్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తానని అక్షత తెలిపారు. వీరి సోషల్ మీడియా పోస్టు అందరినీ ఆకట్టుకుంటోంది.

Exit mobile version