పాలస్తీనాకు అనుకూలంగా క్యాంపస్లో నిరసన ప్రదర్శన నిర్వహించినందుకు అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్, మరొకరిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
భారత సంతతి విద్యార్థిని సహా ఇద్దరి అరెస్ట్
న్యూజెర్సీ: పాలస్తీనాకు అనుకూలంగా క్యాంపస్లో నిరసన ప్రదర్శన నిర్వహించినందుకు అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ సంతతి విద్యార్థిని అచింత్య శివలింగన్, మరొకరిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశంపై వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. అచింత్య కోయంబత్తూర్లో జన్మించారు. ప్రస్తుతం కొలంబస్లో ఉంటున్నారు. ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో మెక్కోష్ కోర్ట్యార్డ్ వద్ద విద్యార్థుల నాయకత్వంలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసనకారులు గుడారాలు వేశారు. యూనివర్సిటీ అధికారుల హెచ్చరికలతో ఇద్దరు ప్రిన్స్టన్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. అందులో అచింత్య కూడా ఒకరు. అయితే.. మిగిలిన విద్యార్థులు తమ టెంట్లు తొలగించి, అక్కడే ధర్నాకు దిగారని ప్రిన్స్టన్ అలుమ్ని వీక్లీ పేర్కొన్నది.
ఈ ధర్నాలో దాదాపు వందమంది అండర్గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు. గాజాపై ఘోరమైన దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్తో ఆర్థికపరమైన సంబంధాలను కాలేజీలు తెగతెంపులు చేసుకోవాలని, ఇజ్రెయల్ కంపెనీల నుంచి వైదొలగాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో టెంట్లు ఏర్పాటు చేసిన ఆరు నిమిషాలకే అచింత్య, హసన్ సయీద్ను అరెస్టు చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులు వెంటనే విరమించకపోతే వారిని కూడా క్యాంపస్ నుంచి తొలగిస్తామని యూనివర్సిటీ అధికారులు బుధవారమే హెచ్చరించారు.