అఫ్గానిస్థాన్ (Indian Plane Crash) లో కూలిపోయిన విమానం ఏ దేశానికి చెందినది అన్న దానిపై స్పష్టత వచ్చింది. ఆ విమానం మొరాకో దేశానికి చెందిన ప్రైవేటు విమానమని
అఫ్గానిస్థాన్ (Indian Plane Crash) లో కూలిపోయిన విమానం ఏ దేశానికి చెందినది అన్న దానిపై స్పష్టత వచ్చింది. ఆ విమానం మొరాకో దేశానికి చెందిన ప్రైవేటు విమానమని అఫ్గాన్ అధికారులు తాజాగా ప్రకటించారు. తొలుత ఈ విమానం భారత్కు చెందిన ప్రయాణికుల విమానమని.. తర్వాత భారత్కే చెందిన ఛార్టెడ్ విమానమని స్థానిక ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది. శనివారం తెల్లవారుజామున బదాక్షన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిర్దేశించిన మార్గంలో కాకుండా విమానం మరో మార్గంలో ప్రయాణంచి పర్వతాలను ఢీకొందని స్థానిక అధికార మీడియా ఖామా ప్రెస్ ప్రకటించింది.
ఇది ఏ శ్రేణి విమానం, అందులో ఎంత మంది ఉండొచ్చనే దానిపై ఎటువంటి వివరాలూ వెల్లడి కావడం లేదు. కొంత మంది అధికారులు ఇది ఒక ఛార్టెడ్ ఫ్లైట్ అని.. రష్యా రాజధాని మాస్కోకు వెళుతుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు రాడార్ నుంచి విమానం మాయమైందని.. తర్వాత ప్రమాదం జరిగిందని అఫ్గాన్ (Afghanistan) పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వార్తలపై భారత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. విమాన ప్రమాద కథనాలు నిజమా కాదా.. నిజమే అయితే అది మన దేశానిదేనా నిర్దారించుకునేందుకు ఒక బృందాన్ని అఫ్గాన్కు పంపించింది. మరోవైపు భారత్కు చెందిన విమానాలు ఏవీ.. ప్రమాదం జరిగిందని చెబుతున్న మార్గంలో వెళ్లవని విమానయాన రంగంతో సంబంధమున్న అధికారి ఒకరు పేర్కొన్నారు. తాజాగా భారత ప్రభుత్వం ఇది తమ దేశ విమానం కాదని ఇప్పటికే స్పష్టం చేసింది. అఫ్గాన్ ప్రభుత్వం కూడా అది మొరాకోకు చెందిన విమానమని.. భారత్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.