Petrol | పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల్లో ఇంధనం ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాయాది దేశం పాకిస్తాన్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. దీంతో ఆ దేశ ప్రజల నుంచి పాక్ ప్రభుత్వానికి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుమ్మెత్తిపోశారు. దీంతో పెంచిన పెట్రోల్ ధరలను రాత్రికి రాత్రే తగ్గిస్తూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేసింది.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గురువారం పాకిస్తాన్ ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై 43 శాతం, హైస్పీడ్ డీజిల్పై 55 శాతం పెంచుతూ పాక్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్థానీ రూపాయలకు పెరిగింది. హైస్పీడ్ డీజిల్ ధర 520 పీకేఆర్కు చేరింది.
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో.. ప్రజలు తీవ్రస్థాయిలో పాక్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే పాక్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన చేశారు. లీటర్ పెట్రోల్పై రూ. 80 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తగ్గించన ధరలతో లీటర్ పెట్రోల్ 378కే లభిస్తుంది. కనీసం ఒక నెల రోజుల పాటు ఈ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులే పెట్రోల్ ధరలు పెరుగుదలకు కారణమని ప్రధాని చెప్పారు.
