Offer | భారతదేశంలో జనాభా రేటు అంతకంతకే పెరిగిపోతుంది. ప్రస్తుతం అధికారికి లెక్కలు రానప్పటికీ భారత జనాభా 150 కోట్లు దాటి ఉంటుందదని అంచనా. ఇప్పుడు జననాల రేటు కాస్త తగ్గిందిగానీ.. ఒకప్పుడైతే ప్రభుత్వాలే రంగంలోకి దిగి కుటుంబ నియంత్రణపై విస్తృత ప్రచారం కల్పించాల్సి వచ్చింది. 'ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు' అనే నినాదం బహుళ ప్రాచుర్యం పొందింది.
Offer : భారతదేశంలో జనాభా రేటు అంతకంతకే పెరిగిపోతుంది. ప్రస్తుతం అధికారికి లెక్కలు రానప్పటికీ భారత జనాభా 150 కోట్లు దాటి ఉంటుందదని అంచనా. ఇప్పుడు జననాల రేటు కాస్త తగ్గిందిగానీ.. ఒకప్పుడైతే ప్రభుత్వాలే రంగంలోకి దిగి కుటుంబ నియంత్రణపై విస్తృత ప్రచారం కల్పించాల్సి వచ్చింది. ‘ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు’ అనే నినాదం బహుళ ప్రాచుర్యం పొందింది.
అయితే ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ తగ్గిపోయిన జననాల రేటును పెంచేందుకు ఆ దేశం వినూత్న చర్యలకు సిద్ధమైంది. అందులో భాగంగా బిడ్డలను కనే దంపతులకు ప్రోత్సాహకాలను ప్రకటించే యోచన చేస్తోంది. ఒక్క బిడ్డను కంటే 59 వేల పౌండ్లు (మన కరెన్సీలో దాదాపు రూ.61 లక్షలు) ప్రోత్సాహకంగా అందించే అంశాన్ని దక్షిణ కొరియా సర్కారు పరిశీలిస్తోంది.
అయితే ఈ కార్యక్రమాన్ని అమలుచేసే ముందు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక, పౌర హక్కుల కమిషన్ ఓ పబ్లిక్ సర్వేను చేపట్టినట్లు తెలుస్తున్నది. ఈ సర్వే ఏప్రిల్ 17న ప్రారంభమైనట్లు సమాచారం. అంతేకాదు పిల్లలను కనేవారికి అందించే ప్రోత్సాహకాల కోసం ఏటా 12.9 బిలియన్ పౌండ్లు (మన కరెన్సీలో సుమారు రూ.1.3 లక్షల కోట్లు) ఖర్చు చేసేందుకు దక్షిణకొరియా సిద్ధమైంది. ఇది ఆ దేశ బడ్జెట్లో దాదాపు సగం కావడం గమనార్హం.
కాగా, దక్షిణ కొరియా దేశంలో జననాల రేటు భారీగా తగ్గిపోతున్నది. 2023లో ఇది 0.72కు పడిపోయింది. 2023లో నమోదైన జాతీయ జననరేటు ఆ దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టం. అయితే దక్షిణకొరియాలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత వెరసి అక్కడి దంపతులు వివాహ బంధానికి, పిల్లలను కనేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ దేశంలో జననాల రేటు ఏటికేడు తగ్గిపోతోంది.