Hidma last letter| ఎన్ కౌంటర్ కు ముందు జర్నలిస్టుకు హిడ్మా లేఖ?

ఏపీ ఎన్ కౌంటర్ లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ కు ముందు లొంగిపోయే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. లొంగుబాటు ఆలోచనతో ఓ జర్నలిస్టుకు హిడ్మా లేఖ రాసినట్లుగా సమాచారం వెలుగు చూసింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Nov 19, 2025, 12:10 pm IST
Read Time: 4 mins
Hidma last letter| ఎన్ కౌంటర్ కు ముందు జర్నలిస్టుకు హిడ్మా లేఖ?

అమరావతి : ఏపీ(Andhra Pradesh) ఎన్ కౌంటర్ (Encounter)లో హతమైన మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Madvi Hidma)ఎన్ కౌంటర్ కు ముందు లొంగిపోయే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. లొంగుబాటు ఆలోచనతో ఓ జర్నలిస్టు(journalis)కు హిడ్మా లేఖ (letter) రాసినట్లుగా సమాచారం వెలుగు చూసింది. హిడ్మా తన ఆలోచనలు, నిర్ణయాలపై చత్తీస్గడ్ లోని బస్తర్ కి చెందిన ఓ జర్నలిస్టుకు లేఖ రాశారు. తనను ఏపీకి రావాలని నవంబర్ 10న హిడ్మా లేఖ రాశారు. ఆయుధాలు వీడే అవకాశం ఉన్నట్లు లేఖలో పేర్కొన్నాడు. భద్రత కల్పిస్తే తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు హిడ్మా ప్రకటించారు. త్వరలోనే హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ రిలీజ్ చేస్తామని హిడ్మా లేఖలో పేర్కొన్నాడు.

ఆయుధాలు విడిచిపెట్టెముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది

లేఖలో హిడ్మా ‘నా ఆయుధాలు విడిచి పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడ లొంగిపోవాలన్నది కమిటీతో మాట్లాడి నిర్ణయించాల్సి ఉంది. మా భద్రతకు పోలీసులు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది. లొంగిపోయిన మావోయిస్టు నాయకులు సోను, సతీశ్‌లు అవకాశవాదులు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ మార్గంలో అచంచలంగా ఉన్నాం. సోను, సతీశ్ కొంతమంది ఇతర కేడర్లను మోసం చేసి కొంతమంది లొంగిపోయేలా చేశారు. మావోయిస్టు పార్టీ లైన్‌ను వక్రీకరించారు. వారు చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధం. వీరమరణం పొందే ముందు మావోయిస్టు అగ్రనేతలు మహాశివుడు, నంబాల కేశవ్‌రావు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పినట్లుగా ఎలాంటి ఆధారం లేదు. సోను, సతీశ్‌లు తప్పుడు విషయాలను నమ్మి లొంగిపోయారు. లొంగిపోయిన ఇతర మావోయిస్టు కేడర్లు పునరాలోచించాలి. ప్రజాహిత దృక్పథంతో పనిచేస్తే విప్లవ పక్షంలోకి తిరిగి రావచ్చు’ అని హిడ్మా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఈ లేఖ హిడ్మా చివరి లేఖ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేఖకు సంబంధించిన సమాచారం ఏది తమకు తెలియదని ఏపీ పోలీసు అధికారులు తెలిపారు.