Bandi Sanjay| సిట్‌ విచారణకు రాలేను: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Jul 27, 2025, 12:22 pm IST
Read Time: 2 mins
Bandi Sanjay| సిట్‌ విచారణకు రాలేను: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

విధాత, హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్ విచారణ(SIT Hearing)కు తాను ప్రస్తుత సమయంలో రాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా సోమవారం విచారణకు రాలేనని తెలిపారు. విచారణకు సమయం కావాలని సిట్ ను కోరారు. పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ కారణంగా ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు హాజరు కాలేకపోతున్నానని లేఖలో బండి సంజయ్‌పేర్కొన్నారు. అంతకుముందు ఈనెల 24న విచారణకు హాజరై సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది. 28న విచారణకు హాజరు అవుతానని సంజయ్ తెలిపారు. ఇంతలోనే పార్లమెంటులో ఆపరేషన్ సిందూర్ పై చర్చకు తేదీలు ఖరారు కావడంతో బండి సంజయ్ సిట్ విచారణకు సమయం కోరారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఫహీం ఖురేషి తదితర నేతల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది.