Site icon vidhaatha

Greece: రెండు రైళ్లు ఢీకొని 32 మంది మృతి

గ్రీస్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 32 మంది చనిపోయారు. 85 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వైద్యులు చెబుతున్నారు.

విధాత : గ్రీస్‌ (Greece)లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. వేగంగా వస్తున్న ఒక ప్యాసింజర్‌ రైలు.. అంతే వేగంతో అదే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న మరో గూడ్స్‌ రైలు ఢీకొనడంతో (Two trains collided) 32 మంది చనిపోయారు. 85 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు హాస్పిటల్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఏథెన్స్‌ (Athens) నుంచి థెస్సాలోనికి (Thessaloniki) వస్తున్న ప్యాసింజర్‌ ట్రైన్‌లో ప్రమాదం జరిగే సమయానికి దాదాపు 350 మంది ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రమాదం చోటు చేసుకున్న లారిస్సా (Larissa) అనే ప్రాంతంలోనే యాభై ఏళ్ల క్రితం ఘోర రైలు ప్రమాదం జరిగింది.

ప్రమాద తీవ్రతకు అనేక బోగీల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది గాయపడ్డారు. సహాయ బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటళ్లకు తరలించాయి.

‘ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. అంతా పది సెకన్లలోనే అయిపోయింది’ అని రైలు శకలాల నుంచి బయటపడిన ఒక ప్రయాణికుడు చెప్పాడు. రైలు బోగీ ప్రమాదానికి గురికాగానే ఒక వైపునకు ఒరిగిపోయింది. మేం అంతా భయపడిపోయాం. వైర్లలోంచి మంటలు వచ్చాయి. బోగీ తిరగబడటంతో రెండు వైపులా మంటలు వ్యాపించాయి. అందరికీ మంటలు అంటుకున్నాయి’ అని ఆయన వివరించాడు.

Exit mobile version