Mumbai Airport | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ ఏడుగురు వ్యక్తుల వద్ద 61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 32 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అరెస్టు అయిన వారిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులు.. బంగారాన్ని బిస్కెట్లు రూపంలో తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అమర్చిన బెల్టులలో వీటిని అమర్చి తీసుకొస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి 55 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం బిస్కెట్ల ధర రూ.28.17 కోట్లు ఉంటుందని తెలిపారు. వీరికి ఈ బంగారాన్ని దోహా విమానాశ్రయంలో సుడాన్ దేశస్థుడు అందించాడని పేర్కొన్నారు. మరో కేసులో.. దుబాయ్ నుంచి వచ్చిన విస్తారా విమానంలో ముగ్గురు ప్రయాణికుల నుంచి 8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ధర రూ. 3.88 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.