స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని ఏబీవీపీ ధర్నా
స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని బుధవారం ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థలను బహిష్కరించిన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

విధాత, హైదరాబాద్ : స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని బుధవారం ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థలను బహిష్కరించిన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్లో నిజాం కళాశాల ముందు, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ధ ఏబీవీపీ విద్యార్థులు ధర్నాలు నిర్వహించగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ స్కాలర్షిప్లు , ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా.. అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా కనీసం యూనివర్సిటీల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. వెంటనే విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లింపులు చేసి వార్షిక పరీక్షల ముందు వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వేతనాల కోసం ఖమ్మం ఆస్పత్రి సిబ్బంది ధర్నా
నాలుగు నెలలుగా జీతాలు లేవని ఖమ్మం ఆస్పత్రి ముందు సిబ్బంది ధర్నాకు దిగారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుటే భోజనం చేసి నిరసన తెలిపారు. వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ నడవడం కష్టంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు. వారి ధర్నాకు ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రి సిబ్బంది వేతనాలు చెల్లించి వారికి, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.