Adilabad అప్పటి నుంచి ఊరిలో అరిష్టాలు అంటున్న గ్రామస్తులు ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి దేవుడికి అపచారం జరిగినందునే ఇద్దరికీ కంటిచూపు పోయిందని గ్రామస్తుల ఆరోపణ రాజకీయ రంగు పులుముకున్న హనుమాన్ కళ్లు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్ గావ్ లో హనుమాన్ ఆలయంలో అపచారం చోటుచేసుకుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్థుల కథనం మేరకు రోజుల క్రితం డోంగర్ గావ్ లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ […]
Adilabad
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని డోంగర్ గావ్ లో హనుమాన్ ఆలయంలో అపచారం చోటుచేసుకుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్థుల కథనం మేరకు రోజుల క్రితం డోంగర్ గావ్ లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ వచ్చారు.
తిరిగి వెళుతున్న సమయంలో ఎమ్మెల్యే హనుమాన్ విగ్రహానికి వెండి కళ్లు ఉన్నాయని, వెండి కళ్ల స్థానంలో బంగారు కళ్లు చేయిస్తానని చెప్పిన రేఖానాయక్ అక్కడి హనుమాన్ విగ్రహానికి ఉన్న వెండి కళ్లను ఆమె తీసుకెళ్లారు. నెల రోజులు గడిచినప్పటికీ ఎమ్మెల్యే హనుమాన్కి బంగారు కళ్లు చేయించలేదు. ఉన్న వెండికళ్లను ఎమ్మెల్యే తీసుకెళ్లడంతో అప్పటి నుంచి కూడా హనుమాన్ విగ్రహం కళ్లు లేకుండానే ఉన్నది.
ఈ నేపధ్యంలో గ్రామంలో అనేక అరిష్టాలు జరుగుతున్నయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హనుమాన్ విగ్రహానికి ఉన్నవెండి కళ్లను ఎమ్మెల్యే రేఖానాయక్ తీసుకెళ్లినప్పటి నుంచే దేవుడి మహిమతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు. అందులో భాగంగా గ్రామానికి చెందిన హనుమాన్ విగ్రహం కళ్లు పోవడంతో గ్రామ పటేల్ పెందూర్ బాదు, గ్రామ పెద్ద మనిషి మడావి దేవుషా కళ్ల చూపు పోయిందనీ గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది శాపంగా భావిస్తున్న గ్రామస్తులు ఇంకెంత మందికి కంటి చూపు పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్ ఆ గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే రేఖ నాయక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు కళ్ల పేరుతో దేవుడికి ఉన్న వెండి కళ్లను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.
ఆదివాసీ సంస్కృతి అతి పవిత్రమైందని, ఆదివాసీల నమ్మకాలను, విశ్వాసాలకు భంగం కలిగిస్తే ఎమ్మెల్యే కు ఆదివాసీలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. గతంలో సైతం ఆ గ్రామ హనుమాన్ ఆలయంలో ఉన్న ఓ చిన్న విగ్రహం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరినప్పటికీ గ్రామస్తులు తిరస్కరించారని తెలిపారు.
అప్పటినుండి ఆలయంలోని ఏదో వస్తువు తీసుకెళ్లాలని భావించిన రేఖ నాయక్ గ్రామస్తులు అడగకుండానే హనుమాన్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానంటూ, దేవుడికి బంగారు కళ్లు చేయిస్తానని ఉన్న వెండి కళ్లను తీసుకెళ్లడంతో గ్రామానికి అపచారం జరిగిందని గ్రామస్థులు నమ్ముతున్నారు. ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతల విమర్శల నేపధ్యంలో హనుమాన్ కళ్లు రాజకీయ రంగు పలుముకున్నట్లయ్యింది.
హనుమాన్ కళ్ల విషయంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచార విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖ నాయక్ స్పందిస్తూ దేవుని గుడిపై, దేవుని కళ్లపై కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. ఐదు వందల రూపాయల విలువైన హనుమాన్ విగ్రహ వెండి కళ్ల విషయంలో రాజకీయం చేయవద్దని పేర్కొన్నారు.
వెండి కళ్ల స్థానంలో బంగారు కళ్లు చేయిస్తానని మొక్కుకున్నానని, మొక్కు తీర్చుకుంటానని, ఈ విషయంలో రాజకీయం తగదని పేర్కొన్నారు. అయితే హనుమాన్ వెండి కళ్లు తీసుకోవడం మూలంగా అపచారం జరిగిందని అందరూ ఆందోళనగా ఉన్నందునా, సున్నితమైన దేవుడి అంశం విషయంలో ముందుగానే బంగారు కళ్లు చేయించి వెండి కళ్లు తీస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముందుగానే వెండి కళ్లు తీసి దేవుడిని 30 రోజులపాటు కళ్లు లేకుండా చేశారని ఆదివాసీలు సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నందునా, గ్రామస్తుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టడానికి ఇప్పటికైనా ఎమ్మెల్యే రేఖ నాయక్ బంగారు కళ్లు చేయిస్తుందో లేదో వేచి చూడాల్సివుంది.