Site icon vidhaatha

Amit Shah | అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు

Amit Shah |

విధాత: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తన తెలంగాణ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. గురువారం ఖమ్మం పట్టణంలో జరిగే సభకు రావడం రాలేనని, సభను రద్దు చేసుకోవాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డికి తెలిపారని సమాచారం. దీంతో ఖమ్మం సభను రద్దు చేశారు. జన సమీకరణ చేయలేని కారణంగానే సభ రద్దయిందని సమాచారం.

అసలే బీజేపీకి కనీస బలం లేని జిల్లా కావడంతో ప్రజలను సభకు తరలించే విషయంలో నేతలు డైలమాలో పడినట్టు తెలుస్తున్నది. అమిత్‌షా వంటి నేత పాల్గొనే సభ అంటే.. భారీ స్థాయిలోనే నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే పార్టీ బలం ఏమిటో బయటపడిపోతుంది. పొరుగు జిల్లాల నుంచి తరలించాలన్నా అంత శక్తి లేని విషయాన్ని నేతలు ఒప్పుకోక తప్పలేదు. దీంతో లోపల ఏం చర్చించారోగానీ.. పైకి మాత్రం తుఫాను అంశాన్ని ప్రస్తావించి.. సభను వాయిదా వేశారు.

బండికి సెటైర్ల వరద

అమిత్‌షా పర్యటన ఎందుకు రద్దయిందనే విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పిన కారణాలు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. రాజకీయాల కంటే ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమని, తుఫాను తీవ్రత గుజరాత్‌, మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నందున ఖమ్మం సభను వాయిదా వేసుకున్నామని ఆయన చెప్పారు. త్వరలో ఖమ్మంలో సభ నిర్వహించి, బీజేపీ సత్తా చూపిస్తామన్నారు.

రాజకీయాల కంటే ప్రజల కష్టాలే ముఖ్యం అని బీజేపీ అనుకుంటే.. రైతులు ఏడాదిపాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు చేసిన రాజకీయాల సంగతేంటని పలువురు ఎత్తిపొడుస్తున్నారు. మొన్నటికి డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. తమకు న్యాయం చేయాలని ప్రధానిని వేడుకున్నారు. దేశానికి పతకాలు తెచ్చినవారి విజ్ఞప్తులను ప్రధాని కర్ణాటక ఎన్నికల బిజీలో ఉండి పట్టించుకోలేదా? అని ఎద్దేవా చేస్తున్నారు.

అమిత్‌ షా పర్యటన రద్దు కావడానికి తుఫాను కారణం కావొచ్చు. కేంద్ర హోం మంత్రిగా విపత్తు నిర్వహణ బాధ్యతలు ఆయనపై ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా ఉండాలని ఆయన భావించి ఉంటే అందుకు అభినందించాల్సిందే. కానీ సంజయ్‌ రాజకీయాల కంటే ప్రజలే ముఖ్యమని, ఖమ్మంలో సత్తా చూపిస్తామని అనడమే హాస్యాస్పదంగా ఉన్నది అని అంటున్నారు

Exit mobile version