విధాత, హైదరాబాద్ : రైతు భరోసా పథకం సహాయం పొందేందుకు ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది. ఇప్పటిదాకా ఈ పథకంలో నమోదుకాని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల(జూన్) 15 తేదీనాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి జూలై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.6వేల చొప్పున రూ.12వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. జూలై 30న వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల కానున్నందున, అర్హులైన కొత్త పట్టాదారులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
“రైతు భరోసా” పథకానికి దరఖాస్తులు ఇలా…
జూన్ 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్పుస్తకం (PPB) పొందిన రైతులు. వారి గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) వద్ద లేదా మండల వ్యవసాయ అధికారి (MAO) కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు.. పట్టాదారు పాస్పుస్తకం (PPB), ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ (ఆధార్తో అనుసంధానమైన ఖాతా) జిరాక్సు కాపీలను,మొబైల్ నంబర్, పట్టాదారు పాస్పుస్తకం (లేకపోతే ఆన్లైన్ 1B) పత్రాలను సమర్పించాలి.
అర్హులైన కొత్త పట్టాదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోగా దరఖాస్తు చేసుకుని రైతు భరోసా సాయం పొందాలని ప్రభుత్వం పేర్కొంది. దరఖాస్తులను వ్యవసాయ అధికారులు సీసీఎల్ఏ డేటా ఆధారంగా తీసుకుని, రైతు భరోసా పోర్టల్ లో అప్ లోడ్ చేస్తే కొత్త రైతులు రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలో చేరిపోతారు.